హోదా విషయంలో రెండో ఆలోచనే లేదు !

హైదరాబాదులోని లోటస్ పాండ్ లో ఈరోజు మధ్యాహ్నం వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరూ కలసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గడచిన కొన్నేళ్లుగా దేశంలో గుణాత్మక మార్పు రావాలని కోరుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని అధికారాలను తన వద్ద ఉంచుకుని రాష్ట్రాలను ఇబ్బందులపాలు చేస్తోందని, ఈ నేపథ్యంలో కేంద్రంలో సమాఖ్య స్ఫూర్తిని తీసుకొచ్చేందుకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, స్టాలిన్, కుమారస్వామి, అజిత్ జోగి తదతర నేతలను కలిశారని చెప్పారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఏపీ ప్రతిపక్షనేత జగన్ కు నిన్న ఫోన్ చేసి, కలుస్తామని చెప్పామని… వారి ఆహ్వానం మేరకు ఈరోజు కలిశామని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో సమాఖ్య స్ఫూర్తిని తీసుకొచ్చేందుకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. జగన్ తో జరిగిన భేటీలో అన్ని విషయాలను పంచుకున్నామని కేటీఆర్ అన్నారు. అందరు నేతలను కలిసినట్టే… ఏపీకి వెళ్లి జగన్ ను కేసీఆర్ కలుస్తారని చెప్పారు. రానున్న రోజుల్లో చర్చలను మరింత ముందుకు తీసుకెళతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పూర్తి స్పష్టతను ఇచ్చారని రాజ్యసభలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కె.కేశవరావు, లోక్ సభలో ఎంపీ కవితతో పాటు పలు వేదికలపై తాము స్పెషల్ స్టేటస్ పై తమ వైఖరిని స్పష్టం చేశామని, ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి ప్రధాని ఇచ్చిన హామీ మేరకు అది నెరవేర్చాలని చెప్పామని అన్నారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనని ఇందులో రెండో అభిప్రాయం లేదని చెప్పారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు కలసికట్టుగా ఎలా ముందుకు వెళ్లాలో కేసీఆర్ చెబుతారని తెలిపారు. అన్నీ ఇప్పుడే చెప్పేస్తే… ఆ తర్వాత చెప్పడానికి మరేమీ ఉండదని మీడియాతో చలోక్తి విసిరారు.