టీడీపీకి మరో షాక్…వైసీపీ గూటికి మరో ఎమ్మెల్యే…!

MLA Amanchi Krishna Mohan May Quit TDP

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే రావెల కిషోర్ బాబు, మేడా మల్లిఖార్జున రెడ్డి వంటి ఎమ్మెల్యేలు టీడీపీని వీడారు. రావెల జనసేన పార్టీలో చేరితే మేడా వైసీపీ గూటికి చేరారు. అయితే ఇప్పుడు వీరి బాటలోనే మరో ఎమ్మెల్యే టీడీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన‌ వైసీపీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ మార్పుపై కార్యకర్తల అభిప్రాయాలను ఆమంచి కృష్ణమోహన్‌ తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయమై చర్చించేందుకు ప్రకాశం జిల్లా పందిళ్లపల్లిలోని తన నివాసంలో సన్నిహితులు, ముఖ్యకార్యకర్తలతో కృష్ణమోహన్‌ సమావేశమయ్యారు. ఈనెల 13న వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా ఆమంచి‌ వైసీపీలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్‌లో ఉన్న ఆమంచి ఆ తర్వాత వైసీపీ, టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు.

అయితే ఎక్కడా ప్లేస్ ఖాళీ లేకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆమంచిని పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన టీడీపీకి మద్ధతిచ్చారు. అయితే ఆమంచి రాకను స్థానిక టీడీపీ నేతలు పోతుల సురేశ్ – సునీత దంపతులు తీవ్రంగా వ్యతిరేకించారు. కలిసి పనిచేయాలని అధినేత ఎన్నిసార్లు సూచించినా ఆమంచి-పోతుల వర్గాలు కలిసి పనిచేసేందుకు ముందుకు రాలేదు. దీనికి తోడు కొన్ని వ్యవహారాల్లో తన అనుచరులు, మద్ధతుదారులపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో ఆమంచి ఆగ్రహంగా ఉన్నారు. టీడీపీలో తనను పట్టించుకోవడం లేదని ఆవేదనలో ఉన్న ఆయన పార్టీని వీడాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఆమంచి కృష్ణమోహన్‌ను వైసీపీ వైపు తీసుకురావడంలో దగ్గుబాటు వెంకటేశ్వరరావు హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. దగ్గుబాటి ఫ్యామిలీతో మొదటి నుంచి సత్సంబంధాలు కొనసాగిస్తున్న ఆమంచి కృష్ణమోహన్‌ను తమతో పాటు వైసీపీలోకి తీసురావాలని భావించారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. తన కుమారుడు హితేష్‌తో పాటే ఆమంచిని కూడా వైసీపీలో చేర్పించాలని ప్రయత్నించారు. అయితే ఇందుకు కొంత సమయం తీసుకున్న చీరాల ఎమ్మెల్యే వైసీపీలో చేరడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.