లాక్ డౌన్ పై మోడీ తర్జనభర్జన.. మరో సమావేశంపై ఉత్కంఠ.

కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజ వణికేంచేస్తుంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించుకొని ఇంట్లో ఉండటమే ఏకైక మార్గంగా నిర్ణయం తీసుకొని ఆవిధంగానే ఉంటున్నాయి. ప్రస్తుతం ఇండియాలో 21రోజుల తర్వాత లాక్ డౌన్ పొడిగిస్తారా? లేదా? అన్నవిషయమే ఇప్పుడు హాట్ టాపిక్. కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించింది. ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. అయితే.. లాక్‌డౌన్‌తో కరోనా కేసులు తగ్గుతాయని ఆశించగా.. రోజురోజుకూ పెరుగుతున్నాయి.

దీంతో ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ విషయంపై తాజాగా ఆయన ఓ సంకేతమిచ్చారు. ఏప్రిల్ 14 తర్వాత దేశంలో లాక్‌డౌన్‌ను ఒకేసారి మాత్రం ఎత్తేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.  పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లతో తాజాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌పై కొన్ని కీలకమైన సంకేతాలిచ్చారు.

అదేమంటే… ఏప్రిల్ 14 తర్వాత దేశంలో దశల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేసే అవకాశం ఉందని బీజేడీ ఎంపీ పినాకీ మిశ్రా తెలిపారు. లాక్‌డౌన్ ఒకేసారి ఎత్తేసే పరిస్థితి మాత్రం లేదని ప్రధాని మోదీ చెప్పినట్లు ఆయన వివరించారు. ప్రధానితో సమావేశం తర్వాత ఆయన పీటీఐ ప్రతినిధితో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు, లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర రావు ప్రగతి భవన్ నుంచి ఈ సమావేవంలో పాల్గొన్నారు. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా ఉన్నారు.

కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ యథావిధిగా కొనసాగిస్తూ.. మిగిలిన ప్రాంతాల్లో పాక్షికంగా ఎత్తివేసే యోచనలో ప్రధాని మోదీ ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ఈ సమయంలో లాక్‌డౌన్‌ను మరి కొన్ని రోజులు పొడిగించాలని వివిధ రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా అందుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహా పలువురు ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ పొడిగించాలని కోరుతున్నారు.

అంతేకాకుండా లాక్‌డౌన్‌ను పొడిగించడానికే మెజార్టీ రాష్ట్రాలు మొగ్గుచూపుతున్నాయి. ప్రధాని దీనిపై కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ మరోమారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11న ఈ సమావేశం ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ సమావేశం తర్వాత లాక్‌డౌన్‌పై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ‘కరోనా’ రెండో దశను దాటిందని ఎయిమ్స్ ఇప్పటికే ప్రకటించింది. ఈరోజు ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5194కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మరణాల సంఖ్య 149కి చేరింది. దీంతో లాక్‌డౌన్‌ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాలు, నిపుణుల నుంచి సూచనలు వస్తున్నాయని వివరించారు. కరోనావైరస్‌ కేసులు అధికంగా నమోదైన ఉత్తరప్రదేశ్‌లోని 15 జిల్లాలనూ ఏప్రిల్‌ 15 వరకు దిగ్బంధం చేస్తామని అధికారులు ప్రకటించారు. హాట్‌స్పాట్‌లుగా గుర్తించిన ఆయా ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు, సేవలను ఇంటింటికీ చేరవేస్తామని స్పష్టం చేశారు. గౌతంబుధ్ధ్‌ నగర్‌, గజియాబాద్‌, మీరట్‌, ఆగ్రా, షమ్లీ తదితర జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక కరోనా పాజిటివ్‌ కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఏప్రిల్‌ 30 వరకూ లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.