బాబోయ్‌ మోహన్‌బాబు..!

Mohan Babu acted as hero and Villain roles in in Gayathri Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు చాలా కాలం తర్వాత సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. అడపా దడపా ఆయన కొడుకుల సినిమాల్లో కనిపిస్తున్నప్పటికి పూర్తి స్థాయి సినిమాను చేసి దాదాపు దశాబ్ద కాలం అయినట్లుంది. ఎట్టకేలకు ఆయన హీరోగా ఒక సినిమా తెరకెక్కుతుంది. ‘గాయత్రి’ అనే టైటిల్‌తో మోహన్‌బాబు సినిమాను చేస్తున్నాడు. భారీ అంచనాల నడుమ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందుతుంది. పలు విభిన్న చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న మదన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో మోహన్‌బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నాడనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.

గతంలో హీరో పాత్రలతో పాటు మోహన్‌బాబు విలన్‌ పాత్రలను కూడా చేశాడు. ఎన్నో చిత్రాల్లో విలన్‌ పాత్రను పోషించి అద్బుతంగా రాణించాడు. ఇప్పుడు మరోసారి విలన్‌ పాత్రను చేసేందుకు మోహన్‌బాబు సిద్దం అయ్యాడు. ప్రస్తుతం తాను నటిస్తున్న గాయత్రి చిత్రంలో మోహన్‌బాబు హీరో పాత్రతో పాటు విలన్‌ పాత్రలో కూడా నటించబోతున్నాడు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్‌బాబు హీరో మరియు విలన్‌ అనగానే అంచనాలు మరింతగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా లేదో అనేది చూడాలి.

ఇక ఈ చిత్రంలో మోహన్‌బాబుకు జోడీగా నిఖిలా విమల్‌ నటిస్తుంది. యాంకర్‌ అనసూయ కీలక పాత్రలో నటిస్తుంది. మోహన్‌బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మంచు మనోజ్‌ మరియు మంచు విష్ణులు ఈ చిత్రంలో గెస్ట్‌ రోల్స్‌లో కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి మోహన్‌బాబు చేస్తున్న గాయత్రి సినిమా సంచలనాలకు మారు పేరుగా నిలువబోతుందని అంటున్నారు. మోహన్‌బాబు ప్రస్తుతం అంత క్రేజ్‌ ఉన్న హీరో ఏమీ కాదు. అయినా కూడా దాదాపుగా 25 నుండి 30 కోట్ల వరకు ఈ సినిమాకు ఖర్చు చేస్తున్నారు. అంత బడ్జెట్‌ రికవరీ చేయాలంటే సినిమా సూపర్‌ హిట్‌ అవ్వాలి. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలంటే వచ్చే సంవత్సరం వరకు ఎదురు చూడాలి.