నవనీత్ కౌర్‌కు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ

నవనీత్ కౌర్‌కు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ

నటి, అమరావతి పార్లమెంట్ సభ్యురాలు నవనీత్ కౌర్‌కు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. నవనీత్ కౌర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాదని, నకిలీ క్యాస్ట్‌ సర్టిఫికెట్‌తో ఆమె పోటీచేసి గెలుపొందారని ఆరోపిస్తూ మాజీ ఎంపీ, శివసేన నేత ఆనందరావు అదసూల్ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టి కీలక ఉత్తర్వులు వెలువరించింది. పంజాబ్‌ మూలాలు కలిగిన నవనీత్‌ కౌర్‌.. మహారాష్ట్రలో ఎస్సా కేటగిరికి రాదని, ఆమె కులధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేసింది. దీంతోపాటు రూ.2 లక్షల జరిమానా విధించింది. ఆరు నెలల్లోగా కులధ్రువీకరణకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను కోర్టు ముందుంచాలని నవనీత్ కౌర్‌ను ఆదేశించింది.

తాజాగా తన కుల సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పుపై నవనీత్‌ కౌర్‌ స్పందించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆమె చెప్పారు. ‘“నేను ఈ దేశ పౌరురాలిగా బాంబే హైకోర్టు ఆదేశాన్ని గౌరవిస్తాను. నేను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాను, నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకు ఉంది” అని ఎంపీ నవనీత్‌ కౌర్‌ అన్నారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని అమరావతి ఎస్సీ రిజర్వ్ లోక్‌సభ స్థానం నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల్లో నవనీత్ కౌర్ విజయం సాధించారు. నవనీత్ భర్త రవి రాణా ప్రస్తుతం అమరావతి జిల్లా బద్నేరా ఎమ్మెల్యేగా ఉన్నారు.