అక్కినేని హీరో నాగార్జున ఈమద్య వరుసగా మల్టీస్టారర్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈయన నానితో కలిసి ఒక మల్టీస్టారర్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావచ్చింది. తాజాగా నాగార్జున తన తర్వాత ప్రాజెక్ట్ను మెగాస్టార్తో కలిసి చేయబోతున్నాడు. మెగాస్టార్ అంటే మన తెలుగు మెగాస్టార్ చిరంజీవి కాదండోయ్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్. భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్తో కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నాగార్జున ఒక కీలక పాత్రలో నటించేందుకు సిద్దం అయ్యాడు. బాలీవుడ్లో గతంలో నటించిన నాగార్జున సుదీర్ఘ విరామం తర్వాత హిందీ ప్రేక్షకుల ముందుకు నాగ్ వెళ్లబోతున్నాడు.
నాగార్జున చాలా సంవత్సరాల క్రితం ‘ఖుదా గవా’, క్రిమినల్స్, జక్మ్ చిత్రాల్లో నటించాడు. చివరగా 2003లో ఎల్వోసీ చిత్రంలో నాగార్జున నటించాడు. ఆ తర్వాత హిందీ చిత్రా జోలికి నాగార్జున వెళ్లింది లేదు. ఇన్నాళ్లకు మళ్లీ బాలీవుడ్ నుండి పిలుపు రావడంతో కాదనకుండా నటించేందుకు సిద్దం అయ్యాడు. స్వయంగా మెగాస్టార్ ఫోన్ చేసి ఈ చిత్రంలో పాత్ర పోషించాల్సిందిగా కోరడంతో నాగార్జున నో చెప్పలేక పోయాడు అంటూ సమాచారం అందుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు. త్వరలోనే ముంబయిలో బ్రహ్మాస్త్ర చిత్రం షూటింగ్లో పాల్గొనేందుకు నాగార్జున సిద్దం అవుతున్నాడు. ఈ చిత్రంతో నాగార్జున మళ్లీ బాలీవుడ్కు దగ్గర అవుతాడేమో చూడాలి.