సుహాసిని పేరిట కేసీఆర్ స్కెచ్…!

Nandamuri Suhasini To Join TRS Party

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసినిని బరిలోకి దింపి కొత్త ప్రయత్నం చేశారు చంద్రబాబు. కానీ అది వికటించి ఆమె ఊహించని రీతిలో ఓటమిని చవిచూసింది. టీఆర్ఎస్ చూపిన సెంటిమెంటో లేక మరే కారణమో తెలియదు కానీ టీడీపీకి వస్తాయనుకున్న సీట్లు కూడా రాలేదు. అయినా చంద్రబాబు ఏ మాత్రం నిరుత్సాహ పడలేదు. రంగంలోకి దిగాక గెలుపోటములు అంగీకరించాలని భావించారు. ఇక సుహాసిని కూడా రాజకీయాలకు దూరంగా ఉండనుంది అనే టాక్ వచ్చేసింది. అయితే ఇంతలోనే సుహాసిని గులాబీ కండువా వేసుకోనుంది అనే వార్త బయటకు రావటం సంచలనాలకు తెరలేపుతోంది. హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారా.? ఇప్పటికే ఇందుకు సంబంధించి నిర్ణయం జరిగిందా..? అంటూ ఒక కధనాన్నే వండి వార్చింది టీఆర్ఎస్ తాలూకా చానల్. నిజానికి రెండోసారి ముఖ్యమంత్రి పీఠమెక్కాక సుహాసినిపై జాలి చూపించారు కేసీఆర్.

సుహాసినిని అన్యాయం చేశారని చంద్రబాబును తిడుతూ ఆమెపై ప్రేమ ఒలికించారు కేసీఆర్. హరికృష్ణ కూతురు అన్యాయంగా ఓడిపోయిందనే జాలి కలిగిందేమో పాపం ఆమెను టీఆర్ఎస్ లో చేర్చుకొని ఎమ్మెల్సీ ఇవ్వాలని అనుకుంటున్నారట కేసీఆర్.ఈ విషయంపై అధికారిక సమాచారం రానప్పటికీ సుహాసిని టీఆర్ఎస్ లో చేరనుందంటూ వచ్చిన కధనం మీద రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. అయితే కేసీఆర్ చూపిస్తున్నది సుహాసిని పై ప్రేమ కాదని, సుహాసిని పేరుతో ఆయన బాబుని దెబ్బకొట్టే మాస్టర్ ప్లాన్ వేశారని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాక సుహాసినికి ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా తాము ఆంధ్రావాళ్లని కూడా కలుపుకుని పోతామని ఫీలింగ్ క్రియేట్ చేస్తూ ఆ సాఫ్ట్ కార్నర్ తో ఆంధ్రా రాజకీయాల్లో ఎంటర్ కావచ్చని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే ఆంధ్రలో తనకు సానుకూల వాతావరణం ఉందని, సుహాసిని రూపంలో దానిని మరింత క్యాచ్ చేసుకోవాలని టీఆర్ఎస్ వర్గాలు ప్లాన్ చేశాయని తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.