మార్చి నుంచి ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్…మెలిక పెట్టిన లక్ష్మీపార్వతి.

NTR-Biopic-Shooting-From-Ma

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మార్చి లో మొదలు కాబోతోంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన బాలకృష్ణ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. దేశం గర్వించేలా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తామని బాలయ్య చెప్పారు. ఎన్టీఆర్ ఋణం తీర్చుకునేందుకు తనకు లభించిన అరుదైన అవకాశం ఈ బయోపిక్ అని బాలయ్య చెప్పుకొచ్చారు. దీంతో ఎన్టీఆర్ బయోపిక్ వస్తుందో ,రాదో అన్న ఊహాగానాలకు తెరపడింది. బాలకృష్ణ హీరోగానే కాకుండా స్వయంగా ఈ చిత్ర నిర్మాణంలో కూడా పాలు పంచుకుంటున్నారు.

మరోవైపు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఎన్టీఆర్ కి నివాళులు అర్పించిన లక్ష్మీపార్వతి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ తీస్తే అందులో ఆయనకు జరిగిన అన్యాయం కూడా చూపించాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. ఆ ధైర్యం సినిమా తీసేవాళ్లకు ఉందా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ ఆశయాలను నిలబెట్టే వారే ఆయన కు అసలైన వారసులని , ఆ విధంగా నేనే ఎన్టీఆర్ కి నిజమైన వారసురాలు అని కూడా లక్ష్మీపార్వతి చెప్పుకున్నారు. చంద్రబాబుని రాజకీయాల నుంచి బయటకు పంపే దాకా తాను విశ్రమించేదిలేదని ఆమె శపధం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎన్టీఆర్ కి కెసిఆర్ ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వకపోయినా బాలకృష్ణ ఆ సభలకు హాజరు కావడాన్ని ఆమె తప్పుబట్టారు. నాయకుల తీరు ఎలా వున్నా తెలంగాణ ప్రజలు ఎన్టీఆర్ ని ఎప్పటికీ గౌరవిస్తారని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద బయోపిక్ విషయంలో వైస్రాయ్ ఎపిసోడ్ కి స్థానం ఉండాలన్న డిమాండ్ తో లక్ష్మీపార్వతి గట్టి మెలికే పెట్టారు.