ప్రేమించుకున్న అన్నా చెల్లెళ్ళు…నిరాకరించిన పెద్దలు

ప్రేమించుకున్న అన్నా చెల్లెళ్ళు...నిరాకరించిన పెద్దలు
వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలనుకున్నారు. ఇదే విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పగా వారు అంగీకరించలేదు. ప్రేమికులిద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లు కావడంతో తాము పెళ్లి చేయలేదని పెద్దలు చేతులెత్తేశారు. కలిసి ఉండలేక, విడిపోయి బతకలేక చనిపోవడమే మంచిదని పురుగుల మందు తాగేశారు. రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి.
శంకర్‌పల్లి మండలంలోని మహారాజ్‌పేట గ్రామానికి చెందిన మమత(20), ఇంటి సమీపంలో ఉండే రమేష్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు తమ ప్రేమ విషయం కుటుంబసభ్యులకు తెలిపి వివాహం చేయాలని కోరారు. అయితే మమత, రమేశ్‌ వరుసకు అన్నాచెల్లెళ్లు కావడంతో పెళ్లి చేసేందుకు వారి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో కొద్దిరోజుల పాటు దూరంగా ఉన్నప్రేమికులు ఇటీవల మళ్లీ కలిసి తిరగడం మొదలుపెట్టారు.

ఈ విషయం తెలుసుకున్న మమత తండ్రి యాదయ్య కూతురికి వేరే వ్యక్తితో వివాహం కుదిర్చి నిశ్చితార్థం చేశాడు. దీంతో తాము ఇకపై కలిసి జీవిచడం కుదరదని బావించిన మమత, రమేశ్ కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారు. దీంతో శనివారం ఇద్దరూ పురుగులమందు తాగేశారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వారిద్దరిని హుటాహుటిన సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా వారిని ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మమత చనిపోగా రమేశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.