ఫోన్ పే సరి చేయాలంటూ.. లింక్ పెట్టి.. లక్ష లాగేశాడు.. !

ఆంధ్రప్రదేశ్ లో సైబర్ నేరానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. యాప్‌ పేరు చెప్పి..ఓ వ్యక్తి బ్యాంక్‌ ఖాతా నుంచి నగదు కొట్టేశాడు. తాజాగ నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడి తెలిపిన వివరాల ప్రకారం… స్థానిక దిలార్‌భాయ్‌ వీధికి చెందిన షేక్‌ మహబూబ్‌ బాషా అనే వ్యక్తి స్వీట్‌ స్టాల్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఓ వ్యక్తి ఫోన్‌ చేసి మీ ఫోన్‌పే యాప్‌ గడువు తీరిందని.. వివరాలు తెలిపితే తిరిగి సరిచేస్తామని తెలిపారు. దాంతో ఏటీఎం కార్డు, పిన్‌ నంబర్‌ చెబితేనే ఫోన్‌పే పనిచేస్తుందని నమ్మించాడు. దీంతో మహబూబ్‌ బాషా తనకు ఆ నంబర్లన్నీ తెలియవని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. ఆ వ్యక్తి మహబూబ్‌ బాషా సెల్‌ఫోన్‌కు ఒక లింక్‌ పంపి ఫోన్‌ చేశాడు. ఆ లింక్‌ ఓపెన్‌ చేస్తే మీ ఫోన్‌పే పునరుద్ధరణ జరుగుతుందని అన్నాడు.

అయితే మహబూబ్‌ లింక్‌ ఓపెన్‌ చేశాడు. దాంతో ఖాతాలోని నగదును ఆన్‌లైన్‌ ద్వారా డ్రా చేశారు. తాజాగా బంధువులకు నగదు పంపేందుకు తన ఫోన్‌పే ద్వారా బ్యాలెన్స్‌ పరిశీలించుకోగా రూ.1,03,900 ఉండాల్సి ఉండగా కేవలం 36 పైసలు మాత్రమే ఉన్నట్లు చూపిస్తోంది. వెంటనే ఆ వ్యక్తి నగదు మాయం చేశాడని గుర్తించిన మహబూబ్‌ వెంటనే స్థానిక సిండికేట్‌ బ్యాంక్‌కు వెళ్లి అక్కడి అధికారులకు తెలిపాడు. వారి సూచన మేరకు ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు. పోలీసులు రంగంలోకి దిగి ఆ కేసును దర్యాప్తే చేస్తున్నారు.