హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న తిరునగరి ప్రశాంత్ శ్రీనగర్ కాలనీలోని పద్మజ అపార్ట్మెంట్ లోని తన నివాసంలో ఆదివారం రోజున ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. తన భార్య వేరొకరితో అక్రమ సంబంధం కలిగిఉందని, ఆ విషయంలో పరువుపోతుండడం వలన, ఇంటా బయట మనశ్శాంతిగా తిరగలేకపోతున్నాని, ఈ విషయంలో తాను ఎన్నిసార్లు చెప్పినా, తన భార్య అయిన పావనిలో ఎటువంటి మార్పులేదని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ప్రశాంత్ తన సూసైడ్ నోట్ లో రాశాడు. ఈ విషయంలో ప్రశాంత్ భార్య పావనిని ప్రశ్నించిన పోలీసులుతో ప్రశాంత్ సూసైడ్ నోట్ లో రాసింది నిజం కాదని, తను నా మీద లేని పోని అనుమానం పెంచుకొని, సూటిపోటి మాటలతో మానసికంగానే కాక శారీరకంగానూ వేధించేవాడని వాపోయింది. ఈ విషయంలో విచారణ చేపట్టిన పంజాగుట్ట పోలీసులు, సూసైడ్ కి కొద్దిరోజుల ముందు ప్రశాంత్ తన భార్య పావని తో మాట్లాడిన ఆడియో కాల్ రికార్డు తో పాటుగా, అదనపు ముఖ్యమైన సాక్ష్యాధారాలు దొరకడంతో ప్రశాంత్ భార్యని అరెస్ట్ చేసి, అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే, కామారెడ్డి కి చెందిన తిరునగరి ప్రశాంత్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. 2014 లో హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న వరంగల్ కి చెందిన పావని ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్ళైన కొన్ని నెలలకే తన భార్య పావని కి వేరొకరితో అక్రమసంబంధం ఉన్న విషయం తెలుసుకున్న ప్రశాంత్, ఎన్నోసార్లు తన భార్యని ఈ విషయంలో మందలించాడు. అయినా తన వైఖరిలో ఎటువంటి మార్పు రాకపోగా, పావని జాబ్ విషయంలో ఈమధ్యనే బెంగళూరు కి షిఫ్ట్ అయ్యింది. అక్కడికి వెళ్లిన తరువాత పావని, తాను అక్రమసంబంధం నెరుపుతున్న తన చిన్ననాటి స్నేహితుడితో మరింత స్వేచ్ఛగా తిరగడం ప్రారంభించింది. ఈ విషయమై ప్రశాంత్ స్నేహితులు, తెలిసిన వాళ్ళు విషయం చేరవేస్తుండడంతో, తన పరువు పోతుందని భావించిన ప్రశాంత్ తన భార్య పావని కి కాల్ చేసి, ఇకనైనా అక్రమసంబంధం వదిలేసి, తనతో కలిసుండమని అడిగినా, అలా ఇంకెప్పుడూ కుదరదని, తన బాయ్ ఫ్రెండ్ ని వదులుకునే ఉద్దేశమే లేదని తెగేసి చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రశాంత్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో ఉరి వేసుకొని, ఆత్మహత్య చేసుకున్నాడు.
తగిన సాక్ష్యాధారాలు దొరకడంతో పావని ని అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు ఐపీసీ సెక్షన్ 306 క్రింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.