లొకేషన్స్ వేటలో “పుష్ప” చిత్ర యూనిట్

లొకేషన్స్ వేటలో

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో ‘పుష్ప’ అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. బన్నీ – సుక్కు కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం కేరళ వెళ్లాలని ప్లాన్ చేసారు. కానీ దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన అంతా తారుమారు అయింది. కరోనా మహమ్మారి కారణంగా కేరళ షెడ్యూల్ పూర్తిగా రద్దు చేసుకున్నారట. ఈ సినిమా శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరిగే స్టోరీ కావడంతో దట్టమైన అడవుల్లో షూటింగ్ చేయాలని భావించి కేరళ రాష్ట్రాన్ని ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు మన నేటివిటీకి దగ్గరగా సహజత్వం ఉట్టిపడేలా పాత్రలు పండాలంటే లోకల్ గానే షూటింగ్ చేయాలని డిసైడ్ అయ్యిందంట చిత్ర యూనిట్.

అందుకే మన తెలుగు రాష్ట్రాల్లోనే దట్టమైన అడవులతో ఉండే ప్రదేశాలను.. షూటింగ్ కి అనుకూలంగా ఉండే ప్రదేశాలను చిత్ర బృందం వెతకడం స్టార్ట్ చేసిందట.ఇప్పటికే జగన్ ప్రభుత్వం షూటింగులకు అనుమతించడంతో ఏపీలోనే సినిమా చిత్రీకరణ పెట్టుకుంటే మంచిదని భావించారట. ఇప్పటికే 3 కోట్ల రూపాయలతో మారేడ్పల్లిలో ‘పుష్ప’కి సంభందించిన సెట్స్ వేయడం స్టార్ట్ చేశారట. పోలీసుల పర్మిషన్ వచ్చిన వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ రెడీగా ఉందట. మొత్తం మీద ఈ పాటికి కేరళ అడవుల్లో చాలా భాగం షూటింగ్ జరుపుకోవాల్సిన ‘పుష్ప’ మహమ్మారి వైరస్ కారణంగా ఇన్ని పాట్లు పడేలా చేసిందని సినీ అభిమానులు అంటున్నారు.

‘పుష్ప’ సినిమాని తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు.