దయానంద సరస్వతి ఆశ్రమాన్ని దర్శించిన సూపర్ స్టార్

దయానంద సరస్వతి ఆశ్రమాన్ని దర్శించిన సూపర్ స్టార్

తమిళ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న దర్బార్ చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొన్నది. కొద్ది నెలలుగా ఉత్తర ప్రదేశ్, ముంబై, పూణెలో జరిగిన ఈ మూవీ షూటింగ్‌ను ఇటీవల పూర్తి చేసి గుమ్మడి కాయ కొటేశారు. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే సూపర్ స్టార్ రజనీకాంత్ నేరుగా హిమాలయాలకు వెళ్లిపోయారని చిత్ర యూనిట్ వెల్లడించింది. హిమాలయాల పర్యటన కోసం రజనీకాంత్‌తో ఆయన కుమార్తె ఐశ్వర్య ధనుష్ జత కలిశారు. ఇద్దరు కలిసి ప్రత్యేక విమానంలో మూడు రోజుల క్రితం బయలుదేరి వెళ్లారు. ఆ ప్రాంతంలో ఓ ఆశ్రమంలో వారిద్దరూ ధ్యానం, యోగా చేస్తున్నారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ పర్యటనకు ముందు రుషికేష్‌లోని దయానంద సరస్వతి ఆశ్రమాన్ని దర్శించుకొని ఆశీస్సులు అందుకొన్నారు. ఇటీవల దయానంద సరస్వతిని కలుసుకోన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే ఇటీవల తన ఫ్యాన్స్‌తో భేటీ అయిన ఫోటోలు కూడా మీడియాలో హల్‌చల్ చేశాయి.

హిమాలయాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత రజనీకాంత్ తలైవర్ 168వ చిత్ర షూటింగ్‌లో భాగమవుతారు. ఈ చిత్రానికి సిరుతై శివ దర్శకత్వ వహిస్తుండగా, సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక దర్బార్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 2020 తేదీన విడుదల కానున్నది. ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా, సామాజిక కార్యకర్తగా కనిపించనున్నారు. చంద్రముఖి, కుచేలన్, శివాజీలో రజనీకాంత్ కలిసి నటించిన నయనతార ఈ చిత్రంలో హీరోయిన్. సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. దర్బార్ చిత్రంలో రజనీకాంత్‌తోపాటు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నయనతార, ప్రతీక్ బబ్బర్, నివేదా థామస్, దిలీప్ తాహిల్, నవాబ్ షా, గురు భుల్లార్, యోగిబాబు, శ్రీమన్, జతిన్ శర్మ, తదితరులు నటిస్తన్నారు.