కరోనా వ్యాక్సిన్ కోసం జరుగుతున్న పరిశోధనలు

కరోనా వ్యాక్సిన్ కోసం జరుగుతున్న పరిశోధనలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 35 ఫార్మ కంపెనీలు, సంస్థలు పరిశోధనలు చేస్తుండగా.. వీటిలో కనీసం నాలుగు సంస్థలు వ్యాక్సిన్ అభివృద్ధి చేసి జంతువులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాయి.

బోస్టన్‌కు చెందిన మోడెర్నా థెరప్యుటిక్స్ బయోటెక్ సంస్థ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అభివృద్ధి చేసి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫక్టియస్ డీసీజెస్‌తో కలిసి క్లినికల్ ట్రయల్ వేగవంతం చేసినట్టు అమెరికా అసోసియేషన్ ఆఫ్ అడ్వాన్స్‌మెంట్ ఇన్ సైన్స్ (ఏఏఏఎస్) జర్నల్ తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబరులో వైద్య ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్‌ను అందజేసే ఆలోచనలో ఉన్నట్టు ఆ సంస్థ తెలిపింది. వ్యాక్సిన్‌కు సంబంధించిన స్వల్ప వివరాలను మోడెర్నా వెల్లడించింది.

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ రూపొందించే చర్యలను చైనా ఇప్పటికే ప్రారంభించింది. కోవిడ్ -19 కు కారణమయ్యే వైరస్ సార్స్-కోవి -2 జన్యు క్రమాన్ని చైనా వేరుచేసింది. కోవిడ్-19కు వ్యాక్సిన్ కోసం జనవరిలోనే ప్రయోగాలు ప్రారంభం కావడంతో చైనా వైద్యాదికారులు ఆ వివరాలను ఇతర దేశాలకు తెలియజేయడంలో జాప్యం చేయలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధనా సంస్థలకు కరోనా వైరస్ వ్యాప్తి, మానవ కణాలపై ఎలా దాడిచేస్తుందో గురిచేస్తుందో అధ్యయనం చేయడానికి దోహదపడింది.

వాస్తవానికి కరోనా వైరస్‌లు చైనాలో 2002-04 మధ్య సివియర్ అక్యూరేట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్), 2012లో సౌదీలో మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్)కు కారణమయ్యాయి. గార్డియన్ పత్రిక కథనం ప్రకారం.. సార్స్, మెర్స్ వైరస్‌లు వ్యాప్తి చెందిన తర్వాత నిలిపివేసిన వ్యాక్సిన్ల తయారీ పునఃప్రారంభమైంది. మేరీల్యాండ్‌కు చెందిన నోవావాక్స్ అనే ఒక సంస్థ సార్స్-కోవి -2 కోసం వ్యాక్సిన్ తిరిగి తయారు చేసినట్టు వెల్లడించిందని పేర్కొంది. ఈ వసంతకాలంలో నిర్వహించే క్లినికల్ ట్రయల్స్‌కు చాలా మంది సిద్ధంగా ఉన్నారని వివరించింది.మెర్స్ వైరస్‌ వ్యాక్సిన్‌‌పై పరిశోధనలు చేసిన మోడెర్నా బయోటెక్.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫక్టియస్ డీసీజెస్‌ సహకారంతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది.