రవి ప్రకాష్ కోసం ప్రత్యేక బృందాలు…అయినా దొరకని జాడ ?

టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ జాడ ఇంకా తెలీలేదు. దీంతో ఆయన కోసం తెలంగాణా పోలీసులు చాలా కష్ట పడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి మరీ గాలింపును తీవ్రతరం చేశారని పోలీస్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అయితే కేవలం హైదరాబాద్, సైబరాబాద్‌ పోలీసులే కాక ఇప్పుడు తెలంగాణా టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు కూడా రవిప్రకాశ్ కోసం వెతుకుతున్నారు. ఆయన గతంలో పంపిన మెయిల్స్ ఆధారంగా ఆయన ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ లేదా మరెక్కడైనా తలదాచుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు శివాజీ కూడా అక్కడే ఉండవచ్చని భావిస్తున్నారు. వీరిని విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ, పోలీసులు పలుమార్లు నోటీసులు పంపినా వారు హాజరు కావడంలేదు. అయితే కోర్టును ఆశ్రయిస్తూ, ముందస్తు బెయిల్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, రవిప్రకాశ్ పై నమోదైన రెండు కేసుల్లో ఒకటి హైదరాబాద్, మరొకటి సైబరాబాద్ లో నమోదుకాగా, పోలీసులు ఎవరి కేసు వారిదేనన్నట్టు విచారిస్తున్నారు. నకిలీ పత్రాల సృష్టి, నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలపై ఐటీ యాక్ట్, 66, 72, ఐపీసీ సెక్షన్ 406, 420, 467, 469, 471 కింద సైబరాబాద్‌ పోలీసులు కేసులను నమోదు చేయగా, టీవీ9 లోగో, కాపీరైట్స్, ట్రేడ్‌ మార్కులను మీడియా నెక్ట్స్ ఇండియాకు బదలాయించడంపై బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ ఉద్యోగి ఎంకేవీఎన్‌ మూర్తి, మోజో టీవీ చైర్మన్‌ హరికిరణ్‌ లు తమకు సహకరిస్తున్నట్టు పోలీసు వర్గాల సమాచారం.