చెన్నైలో శ్రీరెడ్డి మీద ఎటాక్ !

చెన్నైలో తన మీద దాడి జరిగినట్టు నటి శ్రీరెడ్డి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీ నిర్మాత సుబ్రమణి, ఆయన అసిస్టెంట్ గోపి దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ చెన్నైలోని కోయంబేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన శ్రీరెడ్డి నిన్ననే చెన్నైకు తిరిగి వెళ్లింది. అంబునగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లోని ప్లాట్ లో ఆమె అద్దెకు ఉంటోంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత సుబ్రమణి, గోపీ తన ప్లాట్ కు వచ్చి తనపై దాడికి పాల్పడ్డారని, తనను చంపేస్తామని బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించింది. అయితే, తనపై జరిగిన దాడి ఘటనకు గల కారణం గురించి శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పోస్ట్ లో వేరే విధంగా పేర్కొంది. తమిళనాడులో పొలాచ్చి సెక్స్ రాకెట్ వ్యవహారం సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాను స్పందించడం వల్లే ఈ దాడి జరిగిందని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉండగా, హైదరాబాద్ పోలీసులు నిర్మాత సుబ్రమణిని ఇటీవలే ఓ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపడం, ఆ తర్వాత విడుదల కావడం జరిగింది. సుబ్రమణి అరెస్టు కావడానికి శ్రీరెడ్డే కారణమని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. దాడి అందుకే జరిగి ఉండచ్చని అంటున్నారు.