Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీదేవి మరణంపై ఫోరెన్సిక్ నివేదికలో దిగ్భ్రాంతికర విషయం వెలుగుచూసింది. ఇప్పటిదాకా శ్రీదేవి గుండెపోటుతో చనిపోయారని అంతా అనుకుంటుండగా… ఫోరెన్సిక నివేదికలో మాత్రం మరో కారణం వెల్లడయింది. శ్రీదేవి ప్రమాదవశాత్తూ బాత్ టబ్ లో మునిగి చనిపోయారని యూఏఈ ఆరోగ్యశాఖ ఒక ప్రకటన చేసింది. ఆ సమయంలో ఆమె మద్యం తీసుకుని ఉన్నారని, దాంతో పట్టు తప్పి నీళ్లల్లో పడిపోయారని ఫోరెన్సిక్ నివేదికలో పేర్కొన్నారు. నివేదికలో ఉన్న వివరాలను శ్రీదేవి కుటుంబసభ్యులకు, ఇండియన్ కాన్సులేట్ అధికారులకు పోలీసులు వివరించారు. ఈ నివేదిక ప్రకారం శనివారం సాయంత్రం పార్టీ నుంచి హోటల్ గదిలోకి వెళ్లిన శ్రీదేవి 7గంటల ప్రాంతంలో బాత్ రూమ్ కు వెళ్లారు. అనుకోకుండా కాలు జారి నీళ్ల టబ్ లో పడిపోయారు. ఆ సమయంలో ఆమె తీవ్ర కంగారుకులోనై టబ్ లో నుంచి పైకిలేవలేక ఊపిరి ఆడక చనిపోయారు.
ఇది జరిగిన కాసేపటికి శ్రీదేవి భర్త బోనీకపూర్ హోటల్ గదికి వచ్చారు. ఎంత కొట్టి చూసినా శ్రీదేవి బాత్ రూం తలుపు తీయకపోవడంతో హోటల్ సిబ్బంది సాయంతో తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న శ్రీదేవిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. దుబాయ్ పత్రికలు కూడా ఇదే విషయాన్ని ప్రచురిస్తున్నాయి. మద్యం మత్తులో బ్యాలెన్స్ కోల్పోయిన శ్రీదేవి బాత్ టబ్ లో పడ్డారని… ఆ తర్వాత నీటిలో మునిగిపోయి ఊపిరాడక చనిపోయారని యూఏఈకి చెందిన గల్ఫ్ న్యూస్ వెల్లడించింది.