హంగైతే కింగెవరు ?

తెలంగాణా ఎన్నికల ఫలితాలకు మరికొన్ని గంటలే మిగిలి ఉండటంతో విజయం ఎవరివైపు మొగ్గుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అన్ని పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే రాబోయే పరిణామాలపై ముందస్తు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే పరిస్థితి ఏంటనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. హంగ్‌ వస్తే కింగ్‌ ఎవరు ? కింగ్‌ మేకర్‌ ఎవరనే దాని మీదే ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నాయి. మొదటి నుంచి మజ్లీస్‌ పార్టీ తమకు మద్దతిస్తుందని అందుకే వారి స్థానాల్లో తమకు ఫ్రెండ్లీ పోటీ ఉందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ చెప్పుకొస్తూనే ఉన్నారు. అయితే తాజా పరిణామాలతో ఎంఐఎం వైఖరి ఎలా ఉండబోతోందనే దానిపైనే ఆసక్తి నెలకొంది. నిన్న కేసీఆర్‌కు ఫోన్‌ చేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఇవాళ ఆయనతో భేటీ కానున్నారు. దీంతో వీరిద్దరి సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ప్రచారం సమయంలో కూడా మజ్లిస్ పోటీలో లేని చోట టీఆర్ఎస్‌కే ఓటెయ్యాలని అసదుద్దీన్‌ ఒవైసీ చెప్పుకొచ్చారు. అయితే ఫలితాలపై అంచనాలు మారడంతో మజ్లీస్‌ తన వైఖరి మార్చుకునే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.

హంగైతే కింగెవరు ? - Telugu Bullet

ఇటు మజ్లీస్‌ను తమ దారికి తెచ్చుకునేందుకు ప్రజాకూటమి కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. వారితో ఒకదఫా చర్చలు కూడా జరిపినట్లు చెబుతున్నారు. ఈ రోజు గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన కూటమి నేతలు ఒకవేళ ఏ పక్షానికీ కూడా మెజారిటీ రాకపోతే కూటమిని ముందు గవర్నర్ ఆహ్వానించేలా కోరనున్నట్టు తెలుస్తోంది. ఎంఐఎం ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ కు అనుకూలంగా మాట్లాడినప్పటికీ అధికారికంగా అది టీఆర్ఎస్తో పాటు కూటమి కట్టలేదు. కాబట్టి ఎంఐఎం పార్టీ, ఫలితాలకు ముందే తమతో ఉన్నట్టుగా గవర్నర్ వద్ద చూపించగలిగితే, ఫలితాల అనంతరం సులువుగా ఉంటుందని కూటమి నేతలు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై అప్పుడే స్పందించబోనని ఒవైసీ చెప్పుకొచ్చారు. దీంతో మజ్లీస్‌ ఎటువైపు అనేది ఆసక్తికరంగా మారింది. మరో 5 నెలల్లో లోక్ సభ ఎన్నికలు రానున్నాయి. అలాగే రేపు వెలువడనున్న 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఒకవేళ 4 రాష్ట్రాల ఫలితాల్లో కాంగ్రెస్‌ గ్రాండ్‌ విక్టరీ కొడితే వచ్చే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో మజ్లీస్‌ ప్రజాకూటమికి మద్దతిచ్చే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా తనవంతు వ్యూహాలను సిద్ధం చేస్తోంది. గతం కన్నా ఎక్కువ స్థానాల్లో గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్న కమలం పార్టీ ఫలితాల తర్వాత ఎవరికి మద్దతివ్వాలనే దానిపై కసరత్తులు ముమ్మరం చేస్తోంది. కాంగ్రెస్‌, మజ్లీస్‌ పార్టీలు లేని ప్రభుత్వానికే తమ మద్దతని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. పైకి అలా చెబుతున్నా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు అధికారం దక్కకుండా చూడాలనేదే ఆ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది.

హంగైతే కింగెవరు ? - Telugu Bullet

ఒకవేళ హంగ్‌ వస్తే తమ పార్టీ మద్దతు కీలకం అని భావిస్తున్న బీజేపీ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. అవసరాన్ని బట్టి ప్రభుత్వంలో చేరకుండా.. బయటి నుంచి మద్దతిచ్చేందుకు కూడా సిద్ధమనే సంకేతాలు ఇస్తోంది. ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకు తమ మద్దతే కీలకం అనుకుంటే కచ్చితంగా సంకీర్ణంలో చేరాలని కూడా బీజేపీ యోచిస్తోంది. అయితే ఈ తాజా ప్రతిపాదనలను రాష్ట్ర నాయకత్వం హైకమాండ్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. అయితే ఫలితాలు వెలువడ్డాకే పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోవాలని హైకమాండ్‌ నుంచి ఆదేశాలు కూడా అందాయని చెబుతున్నారు. తెలంగాణలో ఒకవేళ కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజాకూటమి అధికారంలోకి వస్తే జాతీయస్థాయిలో సమీకరణాలు మారే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. అదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్‌, ఏపీలో టీడీపీ బలపడే అవకాశం ఉంటుందని దీంతో ఈ ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు అధికారం దక్కకూడదనే ఏకైక ఎజెండాతో బీజేపీ పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. ఏమి జరగనుందో తెలియాలి అంటే మరి కొద్ది గంటలు వేచి చూడక తప్పదు.