నేడే పోలింగ్…కాంగ్రెస్ తప్పుకున్నా వ్యూహాలు గట్టిగానే ?

TRS MLC Elections Going On Today

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ఈ ఉదయం ప్రారంభం అయింది. మొత్తం ఐదు స్థానాలకు నోటిఫికేషన్ వెల్లడికాగా, టీఆర్ఎస్ నాలుగు, ఎంఐఎం ఒక్క స్థానంలో పోటీకి నిలిచాయి. కాంగ్రెస్ తన అభ్యర్థిని నెలబెట్టినా పోలింగ్‌కు ముందు రోజు ఎన్నికలను బహిష్కరించినట్టు ప్రకటించింది. 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. మండలి ఎన్నికల నుంచి కాంగ్రెస్‌ తప్పుకున్నా ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, జాగ్రత్తగా ఓటు వేయాలని తమ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటింగు విధానంపై శాసనసభ్యులకు ఆయన సోమవారం దిశానిర్దేశం చేశారు. నిన్ననే మాక్ పోలింగ్ నిర్వహించి ఎలా ఓటు వేయాలో, ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో వివరించారు.

పోలింగ్‌ సందర్భంగా పొరపాట్లు చేయరాదని తెలిపారు. టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశానికి ఎంఐఎం అభ్యర్థి మిర్జా రియాజుల్ హసన్ ఇఫెండి కూడా హాజరయ్యారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అతడికి ఓటు వేయాల్సి ఉన్నందున వారితో సమన్వయానికి ఆయనను ఆహ్వానించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులతోపాటు ఇఫెండిని సీఎం సమావేశానికి పరిచయం చేశారు. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. ఒక్కో అభ్యర్థికి రెండు జిల్లాల ఎమ్మెల్యేలతో ఓట్లు వేయించాలని నిర్ణయించారు. అనంతరం నమూనా పోలింగ్‌ నిర్వహించారు. ఒక్కో అభ్యర్థికి 20 ఓట్లు పడేలా పోలింగ్ జరిపి ఓట్లను లెక్కించారు. మంగళవారం ఉదయం మరోసారి నమూనా పోలింగ్‌ నిర్వహించారు. ఇక, కేసీఆర్ ఆదేశాల మేరకు నిన్న రాత్రి ఎమ్మెల్యేలకు మంత్రులు విందు ఏర్పాట్లు చేశారు.