చైనా మీద వాణిజ్య వార్ ప్రకటించిన ట్రంప్‌

Trump announces trade war on China

అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. అమెరికా ఉత్పత్తులపై చైనా సుంకాలు పెంచితే మేము తక్కువ కాదంటూ చైనా ఉత్పత్తులపై 5 శాతం టారిఫ్‌లను పెంచింది అమెరికా. ప్రపంచ ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్నా ఇలా అగ్రరాజ్యాలు వాణిజ్య యుద్ధం చేయడం ఇబ్బంది కరంగా మారనుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాకు టారిఫ్‌ల డోసు పెంచారు. అమెరికా వస్తువులపై టారిఫ్‌లు విధిస్తున్నట్లు చైనా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ట్రంప్‌ ట్విట్టర్‌ లో చైనాకు చెక్‌ పెట్టారు. చైనాకు చెందిన దాదాపు 550 బిలియన్‌ డాలర్లు విలువైన ఉత్పత్తులపై 5శాతం టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించారు.

ఈ నిర్ణయం చైనా ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ టారిఫ్‌లు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.ప్రస్తుతం 250 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులు 25శాతం టారిఫ్‌ల పరిధిలో ఉన్నాయి.

వీటిని ట్రంప్‌ 30శాతానికి పెంచారు.  ఇక మరో 300 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా వస్తువులపై టారిఫ్‌లను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచారు. ఇవి సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్‌ తన ట్విటర్‌ ఖాతాలో ప్రకటించారు.