చిన్నారితో పాటు ఇద్దరు యువతులు ఆత్మహత్య..

తెలంగాణలోని మేడ్చల్ లో ఇద్దరు యువతుల ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌లో జంట ఆత్మహత్యలు పెను ప్రకంపణలు సృష్టిస్తున్నాయి. డెంటల్ కాలేజీ డంపింగ్ యార్డులో ఇద్దరు యువతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు యువతులు పక్కపక్కనే వేర్వేరు చెట్లకు ఉరేసుకోవడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడే ఘటనా స్థలంలో చిన్నారి మృతదేహం కూడా లభించడంతో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

కాగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలో కూల్‌డ్రింక్ బాటిల్ కనిపించడంతో అందులో ఏదైనా విష పదార్థం కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నారా? అన్న కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయికే ముందుగా పాపకు విషం తాగించి.. ఆమె చనిపోయిన తర్వాత వారిద్దరూ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండ వచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఇద్దరు మహిళల్లో ఒకరు పాపకు తల్లిగా గుర్తించారు. వీరి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కాకుండా ఆర్థిక సమస్యలు కారణమై ఉండవచ్చనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.