భారీ ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే

భారీ ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే

టాలీవుడ్ ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటికే ‘మొహెంజొదారో’ ‘హౌస్ఫుల్ 4’ వంటి చిత్రాల్లో మెప్పించిన పూజా.. తాజాగా మరో భారీ ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. సల్మాన్ హీరోగా తెరకెక్కనున్న ‘కబీ ఈద్ కబీ దివాలీ’లో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకున్నారు. ఈ విషయాన్ని నదియాడ్ వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్(ఎన్జీఈఎఫ్) సంస్థ ఇటీవలే ట్విటర్ వేదికగా ప్రకటించింది. హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటించిన ‘మొహంజోదారో’ చిత్రంతో పూజాహెగ్డే బాలీవుడ్లోకి అరంగేట్రం చేసింది. 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. అయితే గతేడాది విడుదలైన ‘హౌస్ఫుల్ 4’ చిత్రంతో బాలీవుడ్ లో పూజాహెగ్డే మంచి విజయాన్ని అందుకున్నారు.

త్వరలో ఆమె సల్మాన్ఖాన్ తో కలిసి ‘కబీ ఈద్ కబీ దివాలీ’ చిత్రంలో నటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా పూజ హెగ్డే సల్మాన్ తో సినిమా పై తన అభిప్రాయం తెలిపింది. ‘సల్మాన్ తో  పనిచేయడమంటే మనలోని టాలెంట్ కు ఇంకొంచెం మెరుగులద్దుకోవాలని అర్థం. ఎన్నో సంత్సరాల నుంచి ఆయన సినిమాల్లో ఉన్నారు. ఆయనకు ఎంతో అనుభవం ఉంది. అందువల్లే నేను కొంచెం భయపడుతున్నాను. అగ్ర నటీనటులతో నటించే సమయంలో ఇలాగే ఉంటుందేమో. కానీ ఎన్నో మెళకువలు నేర్చుకోవడానికి ఇదో మంచి అవకాశం అనుకుంటున్నాను. ఈ కథ చాలా కూల్ ఫన్నీగా ఉంటుంది. ఆగస్టు నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలను రీషెడ్యూల్ చేయాలని భావిస్తున్నారు.’ అని పూజాహెగ్డే తెలిపారు. ఆల్రెడీ హృతిక్ అక్షయ్ లతో నటించావ్.. ఇంకేం భయం పూజ.. అంటున్నారు ఫ్యాన్స్.