మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మొదట 2025 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. అయితే కొన్ని అనుకోని కారణాలతో ఆ టైమ్లైన్ మారిపోయింది.
సినిమా ఆలస్యం వెనుక పలు రకాల రూమర్స్ వినిపించినా, అసలు కారణం వీఎఫ్ఎక్స్ వర్క్ అనుకున్న స్థాయిలో రాకపోవడమేనని తర్వాత స్పష్టమైంది. క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని నిర్ణయించుకున్న మేకర్స్, వీఎఫ్ఎక్స్ పనులను మరో సంస్థకు అప్పగించడంతో ప్రాజెక్ట్ మరింత ఆలస్యమైంది. పూర్తిస్థాయి అవుట్పుట్ వచ్చేవరకు సినిమా రిలీజ్ చేయకూడదనే నిర్ణయానికి టీమ్ వచ్చినట్టు సమాచారం.
ఇక కొద్దిరోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి స్వయంగా జూలై 10న సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నామని మీడియాకు తెలిపారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఆ డేట్కీ ‘విశ్వంభర’ రావడం కష్టమేనని తేలింది. దీంతో మేకర్స్ మరో కొత్త డేట్ కోసం గాలింపు మొదలుపెట్టారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ‘విశ్వంభర’ను ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల చేయాలని ఫైనల్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఆ రోజు దేశవ్యాప్తంగా హాలిడే ఉండటం, లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ లభించడం, అలాగే ఇప్పటివరకు ఆ డేట్కు ఎలాంటి భారీ సినిమాలు అనౌన్స్ కాకపోవడం మేకర్స్కు కలిసొచ్చే అంశాలుగా మారాయి. అన్ని కోణాల్లో ఆగస్టు 15 పర్ఫెక్ట్ డేట్ అని ‘విశ్వంభర’ యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
