మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష కథానాయికగా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ Vishwambhara. చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నప్పటికీ, గ్రాఫిక్స్, సీజీ వర్క్ కారణంగా విడుదల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.
ఇక ఇటీవల ‘విశ్వంభర’ను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు బలంగా వినిపించాయి. దీంతో ఈసారి అయినా మెగాస్టార్ అభిమానులకు పండుగ ఖాయం అని అంతా భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం దసరా రేసు నుంచి కూడా ‘విశ్వంభర’ తప్పుకున్నట్టుగా తెలుస్తోంది.
దసరా సీజన్లో తెలుగు నుంచి ముందుగా ‘విశ్వంభర’ విడుదల తేదీని లాక్ చేసుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అదే రేసులో విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ చిత్రం ‘రణబాలి’ ఎంట్రీ ఇచ్చింది. దీంతో ‘విశ్వంభర’ ఈ దసరాకు రావడం లేదనే క్లారిటీ వచ్చిన తర్వాతే ‘రణబాలి’ విడుదలను ప్రకటించినట్లు సమాచారం.
దీంతో ఈసారి కూడా ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా దసరా బరిలో రజినీకాంత్ ‘జైలర్ 2’ కూడా ఉండటంతో మెగాస్టార్ సినిమా పోటీ నుంచి తప్పుకున్నట్టే కనిపిస్తోంది.
అయితే ‘విశ్వంభర’ అసలు ఎప్పుడు విడుదల అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ చిత్రానికి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కీలకం కావడంతో క్వాలిటీ విషయంలో మేకర్స్ ఎలాంటి రాజీ పడే అవకాశం కనిపించడం లేదు. మరి ఇంతకాలం ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుంది? వచ్చిన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది? అనేది కాలమే నిర్ణయించాలి.






