వైసీపెలోకి టీడీపీ ఎమ్మెల్యే…బాబు భేటీకి డుమ్మా…!

Rajampet MLA Meda Mallikarjuna Reddy Suspended From TDP

కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో రాజంపేట ఇష్యూ హాట్ టాపిక్ అవుతోంది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీకి రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిని తాను ఆహ్వానించానని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తెలిపారు. తనతో పాటు వస్తానని ఫోన్ లో హామీ ఇచ్చిన మేడా ఇప్పుడు పత్తా లేకుండా పోయారని విమర్శించారు. ఏది ఏమైనా టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. అమరావతిలో ఈరోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడా పార్టీలోకి వచ్చి గెలవగానే ప్రభుత్వ విప్, టీటీడీ బోర్డు పదవి, నియోజకవర్గానికి ఏది కావాలంటే అది ఇచ్చామని గుర్తుచేశారు. ఇంతచేసిన పార్టీకి ఇప్పుడు ద్రోహం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబును కలుసుకునేందుకు రాజంపేట కార్యకర్తలు, నేతలు అమరావతికి వచ్చారన్నారు. స్థానిక ప్రజలు, కార్యకర్తల కోరిక మేరకు ముఖ్యమంత్రి మంచి నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే వైసీపీలో చేరేందుకు టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి రెడీ అయ్యారని తేలడంతో టీడీపీ నాయకత్వం అక్కడ కొత్త నేతల్ని ఎంపిక చేసుకుంటోంది. ఈ క్రమంలో ఆదినారాయణ రెడ్డి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారు. రెడ్ బస్ సంస్థను స్థాపించి సక్సెస్ అయిన రాజంపేటకు చెందిన చరణ్ రాజు కొత్తగా రేసులోకి వచ్చారు. ఆయనకు వ్యవసాయం, రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో టీడీపీ ముఖ్యనేతలతో టచ్ లోకి వెళ్లారు. అతి చిన్న సంస్థగా ప్రారంభమైన రెడ్ బస్ ను దాదాపుగా రూ. 8 వందల కోట్లకు అమ్మేశారు వ్యవస్థాపకులు. ఆ సంస్థ వ్యవస్థాపకులుల్లో ఒకరు చరణ్ పద్మరాజు.

కడప జిల్లా రాజంపేటకు చెందిన చరణ్ బిట్స్ పిలానిలో చదువుకుని స్నేహితులతో కలిసి రెడ్ బస్ ను స్థాపించారు. ఆన్ లైన్ బస్ టికెటింగ్ స్టార్టప్ లలో ఇది మొదటిది. స్వల్పకాలంలోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించడంతో ఓ అంతర్జాతీయ కంపెనీ దాదాపుగా రూ. 800 వందల కోట్లకు నాస్పెర్స్ అనే కంపెనీ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఇది గోఐబిబో సంస్థ కింద ఉంది. అయితే అమ్మేసిన తర్వాత కొన్నాళ్లకు వ్యవస్థాపకులంతా బయటకు వచ్చేశారు. ఆ తర్వాత చరణ్ పద్మరాజు.. కొన్ని స్టార్టప్ కంపెనీలు ప్రారంభించారు. అదే సమయంలో సొంత ప్రాంతం అయిన రాజంపేటలో వ్యవసయదారుల కోసం కొత్త కార్యక్రమాలు చేపట్టాడు. సొంత ఖర్చుతో అత్యాధునిక వ్యవసాయ పద్దతులతో సాగు చేసే విధంగా కొన్ని రైతు సంఘాలను ఏర్పరిచాడు. వారికి నెలానెలా ఆదాయం వచ్చేలా చేశారు. దాంతో రాజంపేట ప్రాంతంలో ఆయనకు కొంత పేరు వచ్చింది. ఇప్పటికే చరణ్ పద్మరాజు ఎంపీ సీఎం రమేష్, మంత్రి ఆదినారాయణరెడ్డిలతోనూ చర్చలు జరిపినట్లు సమాచారం. ఈరోజు చరణ్ రాజు ముఖ్యమంత్రితో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరు రాజంపేట నేతలతో భేటీ అయిన బాబు ఏమి నిర్ణయం తీసుకోనున్నారో వేచి చూడాలి.