సింగరేణిలో కారుకు బ్రేక్ పడినట్టేనా..?

Coal Mining Centre
Coal Mining Centre

సింగరేణి తెలంగాణలో ప్రత్యేకమైన ప్రాంతం..బొగ్గు గనుల కేంద్రం..ఈ ప్రాంతంలో రాజకీయాల్లో గెలుపోటములని ఎక్కువ శాసించేది సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలే. తెలంగాణ ఉద్యమం సమయంలో సింగరేణి కార్మికులు కీలకంగా వ్యవహరించారు. అలాంటి సింగరేణి అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగిలేలా ఉన్నాయి. వాస్తవానికి బి‌ఆర్‌ఎస్‌కు గత ఎన్నికల్లోనే గట్టి దెబ్బ తగిలింది.

తెలంగాణ ఉద్యమ కారులకు అండగా లేకపోవడం..వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్ద పీఠ వేయడంతో ఆ ప్రాంతంలో బి‌ఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ సింగరేణి పరిధిలో 13 నియోజకవర్గాలు వరకు ఉన్నాయి. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం, పినపాక, కొత్తగూడెం, ఇల్లందు, సత్తుపల్లి, రామగుండం, వైరా స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వీటిల్లో బి‌ఆర్‌ఎస్ కేవలం.. చెన్నూరు, బెల్లంపల్లి ,మంచిర్యాల స్థానాలని గెలుచుకుంది. సత్తుపల్లి టి‌డి‌పి గెలుచుకోగా, రామగుండం, వైరా స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. మిగిలిన స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. అంటే కాంగ్రెస్‌దే లీడింగ్.

అయితే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తప్ప..మిగతా వారంతా బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్లారు. అలా వెళ్ళడంతో బి‌ఆర్‌ఎస్‌కు ఆధిక్యం వచ్చింది. కానీ క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలం తగ్గలేదు. ఇప్పటికీ ఆ సింగరేణి బెల్ట్ లో కాంగ్రెస్‌కే లీడ్ కనిపిస్తోంది. పైగా కొన్ని సీట్ల బి‌ఆర్‌ఎస్ లో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇక సింగరేణి కార్మికులకు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. సొంత ఇల్లు నిర్మించుకునే కార్మికుడికి రూ.10లక్షల వరకు వడ్డీ లేని రుణం,భూగర్భ గనులు ప్రారంభిస్తామని, కొత్తగా 30వేల ఉద్యోగాలు, 200 గజాల ఇళ్ల స్థలం, డిస్మిస్‌ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని హామీలు ఇచ్చారు. ఇవి పూర్తిగా అమలు కాలేదు. దీంతో కార్మికులు బి‌ఆర్‌ఎస్ పై అసంతృప్తితోనే ఉన్నారు. ఈ అంశాలు బి‌ఆర్‌ఎస్‌కు నష్టం చేసే ఛాన్స్ ఉంది.