అల్లు శిరీష్‌ అలకతో సైలెంట్‌గా..!

allu sirish on about yuddha bhoomi movie

మెగా హీరో అల్లు శిరీష్‌ తెలుగులో ఇప్పటి వరకు భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లను దక్కించుకోలేక పోయాడు. అయినా కూడా ఈయనకు మలయాళం మరియు తమిళంలో మంచి క్రేజ్‌ ఉంది. మలయాళంలో అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్‌ సాయంతో మోహన్‌లాల్‌తో ఒక చిత్రంలో నటించిన అల్లు శిరీష్‌ ఆ చిత్రాన్ని తెలుగులోకి తీసుకు రాబోతున్నాడు. ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా మలయాళంలో నటించిన అల్లు శిరీష్‌ తెలుగులో విడుదల సమయంలో మాత్రం సైలెంట్‌గా ఉంటున్నాడు. తెలుగులో యుద్ద భూమి అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డబ్బింగ్‌ చేసి భారీ ఎత్తున విడుదల చేయాలని మొదట అల్లు శిరీష్‌ భావించాడు. కాని సినిమా మలయాళంలో కాస్త నిరాశ పర్చింది. దాంతో తెలుగులో కూడా పెద్దగా ఆకట్టుకోలేదనే అభిప్రాయంతో శిరీష్‌ ఉన్నాడు.

అల్లు శిరీష్‌ ప్రస్తుతం ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నా అంటూ ‘యుద్దభూమి’ ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొనడం లేదు. అల్లు శిరీష్‌ ఈ చిత్రంపై ఆసక్తి లేకపోవడంతో సాదా సీదాగా, చాలా సైలెంట్‌గా చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. యుద్ద భూమి ఈనెల 29న విడుదల కాబోతుంది. మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రం గురించి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా తెలియదు. ఈనెల 29న పలు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. సందెట్లో సడేమియా అన్నట్లుగా ఆ చిత్రాలతో ఈ చిత్రం కూడా వచ్చి వెళ్తుందేమో చూడాలి. అల్లు శిరీష్‌ అదనపు పారితోషికం డిమాండ్‌ చేశాడని, అందుకు నిర్మాతలు ఒప్పుకోక పోవడం వల్లే ప్రమోషన్స్‌కు హాజరు కావడం లేదు అంటూ సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏది ఏమైనా ఒక మెగా మూవీ చాలా సైలెంట్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.