ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి కాన్వాయ్ లో ప్రయాణిస్తున్న మంత్రి పత్తిపాటి పుల్లారావు కాన్వాయ్లోని ఓ కారు బోల్తా పడింది. పోలవరం నుండి వెనక్కు వస్తుడగా బాగా వర్షం పడటంతో టైర్లు జారడంతో కారు కొండవైపు బోల్తా కొట్టింది. ప్రమాదంలో మంత్రి అనుచరులకి స్వల్ప గాయాలయ్యాయి. కారు కొండవైపుకు బోల్తా పడటంతో పెను ప్రమాదం తప్పిందని ఒక వేళ లోయ వైపు వెళ్లుంటే ఊహకి కూడా అందనంత ప్రమాదం జరిగేదని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ప్రమాదం గురించి తెలియగానే మంత్రి పుల్లారావు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు కూడా ఆరా తీశారు. మంత్రి పుల్లారావును అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఉదయం కూడా మరో ఘటన జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నేతలు వెళుతున్న బస్సు దెందలూరు దగ్గర మట్టిలో కూరుకుపోయింది. బయటకు తీయడానికి ప్రయత్నించారు. నేతలంతా కలిసి బస్సును తోసినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన సొంత వాహనాల్లో నేతల్ని పోలవరానికి పంపారు. ఇప్పుడు ఇలా జరగడంతో ముఖ్యమంత్రి ఈ రెండు ఘటనల మీద విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.