బడ్జెట్ మీద ఒకే మాట మీద ఏపీ పాలక ప్రతిపక్షాలు

AP ruling parties on a single word on the budget

ఎన్డీఏ-2 ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మొండిచెయ్యే మిగిలింది. విభజన హామీలు, నిధులు కేటాయింపులపై ఈసారైనా బడ్జెట్‌లో ప్రస్తావిస్తారనే ఆశలు ఫలించలేదు. అటు తెలంగాణ, ఇటు ఏపీకీ ప్రత్యేక కేటాయింపులేవీ లేకపోవడంతో అందరూ నిరాశ చెందారు. కేంద్ర బడ్జెట్‌పై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఇది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని, రైతుల ఆశలను నీరుగార్చిందని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమాలకు బడ్జెట్‌లో పెద్ద పీట వేయలేదని, పురోగతిని సుస్థిరపరిచే వ్యవసాయం, ఇన్‌ఫ్రా, సేవ, వాహన రంగాలకు ప్రాధాన్యం తగ్గించారని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు విభజన చట్టంలోని అంశాలను విస్మరించారని, రాజధాని అమరావతి, పోలవరానికి కేటాయింపులు లేకపోవడం దుర్మార్గమని  వ్యాఖ్యానించారు. నరేగా పథకానికి నిధుల కోత సరికాదని, పెట్టుబడులను ఆకర్షించేలా బడ్జెట్‌ లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. నిధుల కేటాయింపులో కేంద్ర పథకాలకే ప్రాధాన్యమివ్వడం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. డిజిటల్‌ చెల్లింపులపై పన్ను తొలగింపును స్వాగతిస్తున్నామని, గతంలో దీనిపై వేసిన కమిటీ ఛైర్మన్‌గా తానున్నప్పుడు చేసిన సిఫార్సుల్లో ఇదే కీలకాంశమని తెలియజేశారు. మొత్తం మీద కేంద్ర బడ్జెట్‌ ప్రజల ఆశలను నీరుగార్చిందని చంద్రబాబు వివరించారు. కేంద్ర బడ్జెట్‌పై వైసీపీ కూడా పెదవి విరించింది. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మొండిచెయ్యి చూపారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. విభజన చట్టంలో అమలు కాని అంశాలు, ప్రత్యేక హోదా లాంటి ప్రధానమైన వాటి గురించి బడ్జెట్‌లో ప్రస్తావన లేదని ఆయన అన్నారు. రాష్ట్రానికి అదనంగా ఇచ్చిందేమీ లేదని, రాష్ట్ర వాటాగా వచ్చే నిధులు కొద్దో గొప్పో పెరిగినా వాటిని ప్రయోజనాలుగా పరిగణించలేమని అన్నారు. విజయవాడ, విశాఖ మెట్రోల విషయంలో అన్యాయం జరిగిందని, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిధుల ప్రస్తావన లేదన్నారు. డ్వాక్రా మహిళలకు ఓవర్‌ డ్రాఫ్ట్‌ రూ.5 వేలు, రూ.లక్ష ముద్ర రుణాలు ఇస్తామనడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. జీరో బడ్జెట్‌ వ్యవసాయంపై పూర్తి స్పష్టత లేదని, గ్రామీణ సడక్‌ యోజనలో రాష్ట్ర ప్రస్తావన లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.