మెగా స్టార్ చిరంజీవి, బాలకృష్ణలు వృతి పరంగా చాలా పోటీ పడుతూ ఉంటారు. కాని వ్యక్తిగతంగా మాత్రం మంచి స్నేహితులు. పలు సందర్బాల్లో ఈ విషయాన్ని వారిద్దరు కూడా చెప్పుకొచ్చాడు. ఒకరి సినీ కార్యక్రమాల్లో ఒకరు, ఒకరి ఫ్యామిలీ వేడుకల్లో మరొకరు పాల్గొనడం చూస్తూనే ఉంటాం. ఇద్దరు ఎంతగా కలిసి ఉన్నా కూడా అభిమానులు మాత్రం కొట్టుకుంటూనే ఉంటారు. వీరిద్దరి అభిమానులు సోషల్ మీడియాలో చిన్న సైజ్ వార్ చేసుకుంటూ ఉంటారు. అభిమానుల విషయం పక్కన పెడితే చిరంజీవి, బాలకృష్ణలు మరోసారి తమ స్నేహంను చాటుకున్నారు. తాజాగా చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు బాలకృష్ణ తన తండ్రి ‘ఎన్టీఆర్’ బయోపిక్లో నటిస్తున్నాడు.
ఈ రెండు కూడా హైదరాబాద్ శివారు ప్రాంతంలో కాస్త అటు ఇటుగా ఒకే చోట చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న బాలకృష్ణ తన చిత్రం షూటింగ్ బ్రేక్లో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం సెట్స్కు వెళ్లాడు. అనుకోని అతిథి సెట్స్లో ప్రత్యక్షం అవ్వడంతో చిరంజీవి, దర్శకుడు సురేందర్ రెడ్డి ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా షాక్ అయ్యారట. సైరా చిత్రీకరణలో పాల్గొంటున్న అమితాబచ్చన్ను కూడా కలిసేందుకు బాలకృష్ణ వెళ్లినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. చిరంజీవి, అమితాబ్, బాలకృష్ణలు చాలా సమయం సరదాగా గడిపారని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. చిత్రం గురించి పలు విషయాలను అడిగి తెలుసుకోవడంతో పాటు, తాను చేస్తున్న ఎన్టీఆర్ చిత్రం గురించి కూడా బాలయ్య చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి బాలకృష్ణ సైరా సెట్స్కు వెళ్లడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. అయితే సైరా యూనిట్ సభ్యులు ఫొటోలో విడుదల చేయకపోవడంతో ఇది పుకారేనేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.