మమతతో బాబు భేటీ…కూటమి ఏర్పాటే లక్ష్యం !

CBN To Meet Mamata Banerjee

బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకొని వచ్చి జాతీయ స్థాయిలో మరో వేదికను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగం సిద్ధం చేస్తున్నారు. కూటమి ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు ఈ రోజు కోల్‌కతా వెళ్లి సాయంత్రం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో సమావేశం కానున్నారు. ఈ నెల ఇరవై రెండున ఢిల్లీలో కూటమి పార్టీల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు మమతా బెనర్జీ ఇప్పటికే అంగీకరించారు. ఆ భేటీలో బీజేపీయేతర పార్టీల భవిష్యత్తు కార్యాచరణ మీద చర్చించనున్నారని తెలుస్తోంది. ఈ భేటీని ముగించుకొని చంద్రబాబు తిరిగి అమరావతి రానున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను కూటమి కట్టి బీజేపీకి ప్రత్యామ్నాయం ఉందని ప్రజలకు తెలియజెప్పాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు.

Chandrababu Fair On Chintamaneni Prabhakar

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కూ, కాంగ్రెస్‌కు మధ్య పలు వివాదాలున్నాయి. అదేవిధంగా వామపక్షాలకు, తృణమూల్ కాంగ్రెస్‌కూ కూడా పడడం లేదన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు అందుకు తృణమూల్ కాంగ్రెస్‌ సహకారం అడిగేందుకు చంద్రబాబు కోల్‌కతా వెళ్లారని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొన్ని విషయాల్లో ఒకే రకమైన ప్రణాళికలు వేస్తున్నాయి. ఉదాహరణకు, చంద్రబాబు సీబీఐ దర్యాప్తులను రాష్ట్రంలో చేయడానికి అధికారం ఇవ్వకుండా ఉత్తర్వులు జారీ చేస్తే.. ఆ నిర్ణయానికి మమత కూడా తన మద్దతు ఇచ్చారు. తర్వాత ఆమె కూడా తమకు సీబీఐ సేవలు అక్కర్లేదని మరో జీఓ విడుదల చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడాన్ని కూడా మమత సమర్థిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు, మమతా బెనర్జీల భేటీ మరోమారు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

mamata banerjee
అంతేకాక తృణమూల్ లాంటి పార్టీలు కాంగ్రెస్‌తో పాటు… సీపీఎం లాంటి పార్టీలతో కలిసి నడుస్తాయా అన్నది సందేహం. దీనికి కారణం వారు ఒకే రాష్ట్రంలో ప్రత్యర్థులుగా ఉంటున్నారు. బీజేపీని మాత్రం ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇలాంటి పార్టీలను కలపడం టీడీపీ అధినేతకు అత్యంత సవాల్‌తో కూడిన అంశంగా మారనుంది. ఇలాంటి సవాల్ మొదటిసారిగా చంద్రబాబు బెంగాల్ విషయంలో ఎదుర్కోబోతున్నారు. అయితే మమతా బెనర్జీ బెంగాల్‌కు సంబంధించిన వరకు పక్కన పెట్టి జాతీయ రాజకీయాల్లో మాత్రం కూటమిలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎందుకటే నిజానికి బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నింటినీ ఏకం చేయాలనే సలహాను మమతా బెనర్జీనే మొదట చంద్రబాబుకు ఇచ్చారు. చంద్రబాబు ప్రయత్నాలకు మద్దతు పలుకుతున్నారు కూడా. జనవరిలో కోల్‌కతాలో నిర్వహించబోయే ర్యాలీని ఆమె బీజేపీయేతర కూటమి బలప్రదర్శనగా మార్చాలనుకుంటున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా కూటమిలో బాగస్వామ్య పక్షంగా ఉండనున్న సిపిఎంకు తృణమూల్ కాంగ్రెస్ కు బద్ద వైరం ఉంది.

Modi

ఇటువంటి భిన్న స్వభావాలు కలిగిన వారిని కూటమిలోకి తీసుకువస్తే వీరు కలిసి ఉండటం కష్టమవుతుందని భావన ఉంది. అందుకే ఇరువురిని అనుసంధానం చేసే బాధ్యత చంద్రబాబు తీసుకున్నారు. బెంగాల్‌లో బీజేపీ వేగంగా ఎదుగుతోందన్న అభిప్రాయాలు ఉన్నందున కలసి కట్టుగా పోరాడటంలో తప్పు లేదన్న ఆ రెండు పార్టీలకు సర్ది చెప్పే ప్రయత్నాన్ని చంద్రబాబు చేయవచ్చు. ఢిల్లీలో జరగనున్న కూటమి సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే అటు కాంగ్రెస్ నుంచి, ఇటు చంద్రబాబు వైపు నుంచి నేతలందరికీ ఫోన్ లు వెలుతున్నాయి. ఢిల్లీలో జరగనున్న సమావేశంలో దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న వైనం, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై చర్చించనున్నారు. సిబిఐ, ఐటీ, ఈడీ దాడులపై రాష్ట్రపతి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఎటువంటి స్పందన రాని పక్షంలో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అవసరమైన కార్యాచరణను కూడా ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. మొత్తానికి మోడీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు అవుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది.