నాది వెన్నుపోటు కాదు…మీదే గురువుపోటు…!

Chandrababu

నిన్న గుంటూరు సభలో మోదీ చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యల మీద బాబు మండిపడ్డారు. నన్ను తిట్టడం కోసమే మోదీ ఢిల్లీ నుంచి వచ్చారని తిట్టేసి పారిపోయారని విమర్శించారు. తిట్టడం సులభమని, పనులు చేయడం కష్టమని ఆయన ఏం చేశారో జవాబు చెప్పలేకపోయారని విమర్శించారు. ఎందుకు అన్యాయం చేశారని రాష్ట్ర ప్రజలు నిలదీస్తున్న నేపద్యంలో రాష్ట్ర హక్కుల కోసం ఇప్పటికే పోరాడుతూనే ఉన్నామని అన్నారు. ఆనాడు కాంగ్రెస్‌ రాష్ట్ర విభజన చేస్తే బీజేపీ కూడా సమర్థించిందని ఈ అంశంలో రెండు పార్టీలకు కూడా బాధ్యత ఉందని అన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికిస్తారా అన్న మోదీ ఇప్పుడు ఆ తల్లిని కూడా దగా చేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. విభజన చట్టం హామీలు అమలు చేయాలని 29 సార్లు ఢిల్లీ వెళ్లానని కానీ ఆయన రాష్ట్రానికి మట్టి, నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు అని మండిపడ్డారు.మోదీ హయాంలో గుజరాత్‌లో ముస్లింలను ఊచకోత కోస్తే రాజీనామా చేయాలని తానే డిమాండ్‌ చేశానని అది మనసులో పెట్టుకుని మోదీ ఇప్పుడిలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేసుల మాఫీ కోసమే జగన్‌ బీజేపీతో లాలూచీ పడ్డారని బీజేపీ సభకు జనం రారని తెలిసి వైసీపీ జన సమీకరణ చేపట్టిందని ఆరోపించారు.

నేనేదో యూటర్న్‌ తీసుకున్నానని మోదీ అంటున్నారని నాది రైట్‌ టర్న్‌ మీదే యూటర్న్‌ ఆయన అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచామని మోదీ తనపై విమర్శలు చేశారని, నిజానికి వెన్నుపోటు పొడిచింది తాను కాదని, గురువుకే వెన్నుపోటు పొడిచిన చరిత్ర మోదీదేనని అన్నారు. తనను చేరదీసి ఆదరించిన అద్వానీకి వెన్నుపోటు పొడిచింది మోదీ కాదా అని ప్రశ్నించారు. గోద్రా అల్లర్ల అనంతరం మోదీని తీసేయాలని వాజ్‌ పేయి సిఫారసు చేసినప్పుడు అద్వానీనే అడ్డుపడి మోదీని ఆదుకున్నారని, అలాంటి అద్వానీ ఎదురుపడి నమస్కారం పెడితే తిరిగి నమస్కారం పెట్టే సంస్కారం కూడా మోదీకి లేదని విమర్శించారు. మోదీ చెబుతున్నట్టు తాము పార్టీలేమీ మార్చలేదని, ఎన్టీఆర్ పేరు పెట్టిన పార్టీలోనే ప్రజాసేవ చేస్తున్నామని, ఏరోజూ తాము అవకాశవాద రాజకీయాల జోలికి పోలేదని చెప్పారు. ఆయన ఛాయ్ వాలా అంటారు. లక్షలు, కోట్ల రూపాయల సూటు, బూటు వేస్తారు. నేను అప్పడూ ఇప్పుడూ ఒకే తరహా డ్రెస్ వేసుకుంటాను అన్నారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై కూడా చంద్రబాబు స్పందించారు. కేంద్రంలోని కాంగ్రెస్‌ తో, అప్పటి ప్రభుత్వ దురహంకారంతో తాము ఆనాడు పోట్లాడామని, ఇవాళ అదే స్థానంలో బీజేపీ న్యాయకత్వంలో అన్యాయం జరుగుతుంటే దేశాన్ని కాపాడేందుకు పోరాడితే తప్పేమిటని ప్రశ్నించారు.