Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పాకిస్థాన్ కు చైనా ఎంత పెద్ద మద్దతు దేశమో తాజాగా మరోసారి ఆవిష్కృతమయింది. ప్రపంచమంతా పాక్ ఉగ్రవాదానికి ఊతం ఇస్తోందని గొంతుచించుకుంటోంటే…చైనా మాత్రం మరోరకం భాష్యం చెప్పింది. నవ్విపోదురుగాక నాకేమిటి సిగ్గు అన్న చందాన పాక్ ను ఆకాశానికెత్తుతూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఉగ్రవాదంపై పోరాడే దేశంలో పాక్ ముందు వరసలో ఉందట. . అంతేకాదు ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఆ దేశం త్యాగాలు కూడా చేస్తోందట…తమ దేశంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడుకునేందుకు అహర్నిశలూ కృషిచేస్తోందట. పాక్ చేస్తోన్న ఈ పోరాటాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాల్సి ఉందట. ప్రపంచ శాంతి కోసం అమెరికా, పాక్ కలిపి ఉగ్రవాదంపై పోరాడాలని చైనా కోరికట.
చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువాచునీయాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంత హఠాత్తుగా పాకిస్థాన్ ను పొగడాల్సిన అవసరం చైనా కు ఏమి వచ్చిందంటే…అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో అఫ్ఘాన్ పై కొత్త వ్యూహం ప్రకటించే క్రమంలో పాకిస్థాన్ పై దుమ్మెత్తిపోశారు. ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంగా మారిందని, పాక్ తన తీరు మార్చుకోకపోతే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పద్ధతి మార్చుకోకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోపక్క భారత్ కు మాత్రం స్నేహహస్తం అందించారు.
భారత్ తో బంధాన్ని మరింతగా బలపరుచుకోవాలనుకుంటున్నామని చెప్పారు. ఆఫ్ఘాన్ కు భారత్ చేస్తున్న సాయాన్ని ప్రశంసించారు. ఈ మాటలే చైనాకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. డోక్లామ్ వివాదం నేపథ్యంలో తమ ప్రత్యర్థి దేశమైన భారత్ ను ట్రంప్ ప్రశంసించి మిత్ర దేశమైన పాకిస్థాన్ ను తూర్పారబట్టటంతో చైనా తక్షణమే రంగంలోకి దిగింది. పాకిస్థాన్ కు మద్దతుగా స్సష్టమైన ప్రకటన చేసి…తన నైజాన్ని బయటపెట్టుకుంది. ఇప్పుడే కాదు…గతంలో పాకిస్థాన్ తీవ్రమైన తప్పులు చేసిన తరుణంలోనూ చైనా ఎప్పుడూ ఆ దేశానికే అండగా నిలిచింది. పాకిస్థాన్, చైనా మధ్య మితృత్వం ఇంతగా పెరగటానికి రెండు దేశాలకు భారత్ పై ఉన్న వ్యతిరేకతే కారణమని విదేశీ నిపుణుల వాదన. చైనా తాజా ప్రకటన చూస్తే ఈ మాటలు నిజమే అనిపిస్తుంది.
మరిన్ని వార్తలు: