Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చంద్రబాబుకు నైతిక విలువలుంటే హోదా విషయంలో తప్పుచేశానని ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత సి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు. హోదాకు బదులు ప్యాకేజీని స్వాగతించిన చంద్రబాబు ఇంకా ఎన్ని యూటర్న్ లు తీసుకుంటారని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు 50 శాతం ఓట్లు కూడా రాలేదని, ఇటీవల చేసిన ధర్మపోరాట దీక్ష అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన విమర్శించారు. తిరుపతిలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని గుర్తుచేసేందుకు ఇప్పుడు సభ పెడతానని చంద్రబాబు అనడం హాస్యాస్పదమన్నారు. అసలు మోడీ ఇచ్చిన హామీలు చంద్రబాబుకు గుర్తున్నాయా… అని ప్రశ్నించారు. హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని చంద్రబాబు ఎప్పుడైనా పరామర్శించారా అని మండిపడ్డారు.
ఒకప్పుడు చంద్రబాబుకు జాతీయస్థాయిలో గుర్తింపు ఉండేదని, హోదా వల్ల ఇప్పుడు చంద్రబాబు లాఫింగ్ స్టార్ అయ్యారని వ్యంగాస్త్రాలు విసిరారు. గవర్నర్ వ్యవస్థపై చంద్రబాబు స్టాండ్ ఏమిటో చెప్పాలని, జస్టిస్ ఈశ్వరయ్య సామాన్య వ్యక్తికాదని, బాధ్యతకలిగిన ముఖ్యమంత్రిగా ఈశ్వరయ్య రాసిన లేఖకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తనకు ప్రాణభయం ఉందని చెప్పడం సిగ్గుచేటని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. నిత్యం కేంద్రంపై పోరాడే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే ప్రాణభయం లేకుండా హాయిగా ఉన్నారని, మరి చంద్రబాబుకు ప్రాణభయం ఎందుకుందని ఆయన ప్రశ్నించారు. బాబు చేసిన అక్రమాలు, అరాచకాలే ఆయనకు ముప్పుతెస్తాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని కాపాడే ముఖ్యమంత్రే ఇలా భయపడుతుంటే… ఇక ప్రజలను ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. ప్రజల నుంచి సానుభూతి సంపాదించుకునే ఎత్తుగడ ఇదని విమర్శించారు.