Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహేశ్ బాబుకు ట్విట్టర్ లో ఆరు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కానీ ఇప్పటిదాకా ఆయన ఫాలో అవుతుంది మాత్రం ఒకే ఒక్కరిని. ఆయన మహేశ్ బాబు బావ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. భరత్ అను నేను సంచలనాత్మక విజయం తరువాత… మహేశ్ ట్విట్టర్ లో ఫాలో అవుతున్న వారి జాబితాలో మరొకరు చేరారు. కెరీర్ క్లిష్టపరిస్థితుల్లో ఉన్న రెండుసార్లు తనకు శ్రీమంతుడు, భరత్ అను నేనుతో కీలక విజయాలు అందించిన దర్శకుడు కొరటాల శివను ఫాలో అవుతున్నారు మహేశ్. బ్రహ్మోత్సవం, స్పైడర్ ఘోర పరాజయం తర్వాత ఒత్తిడిలో ఉన్న మహేశ్ బాబుకు తప్పనిసరిగా ఓ విజయం కావాల్సిన పరిస్థితుల్లో కొరటాల భరత్ అను నేను వంటి బ్లాక్ బస్టర్ అందించారు. ఈ సినిమాకు ముందు తానెలాంటి పరిస్థితుల్లో ఉందీ… మహేశే స్వయంగా వెల్లడించారు.
సినిమా విజయం సాధించిన సందర్భంగా ఏర్పాటుచేసిన థాంక్స్ మీట్ లో మాట్లాడుతూ మహేశ్ రెండేళ్లు ఒత్తిడి అనుభవించానని, ఈ విజయం ఉపశమనం కలిగించిందని తెలిపారు. శ్రీమంతుడు ముందు కూడా తన కెరీర్ ఇలాంటి క్లిష్టపరిస్థితిలోనే ఉందని, భరత్ అను నేను సమయంలోనూ అంతేనని, ఈ రెండు సందర్భాల్లోనూ మంచి చిత్రాల్ని అందించిన కొరటాల శివకు కృతజ్ఞతలని అన్నారు. ఆయనతో మూడో సినిమా చేయడానికీ తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తానెప్పుడూ ఏ చిత్రానికీ ఇంత కష్టపడి పనిచేయలేదన్నారు. సినిమా విడుదల ముందుకు రావడంతో 50 రోజులు నిరవధికంగా షూటింగ్ జరుగుతూనే ఉందని, ఈ ఒత్తిడి తట్టుకోలేక కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లానని, కానీ ప్రతి గంటకూ కొరటాలకు ఫోన్ చేస్తూనే ఉండేవాణ్నని మహేశ్ చెప్పుకొచ్చారు. మొత్తానికి ప్రత్యేక మైన విజయాన్ని అందించిన కొరటాలను మహేశ్ తన జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తున్నారన్నమాట.