Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొన్ని సంవత్సరాల క్రితంతో పోల్చితే సినిమాల బడ్జెట్ అమాంతం పెరిగి పోయింది. చిన్న హీరోతో సినిమాలు చేయాలన్నా కూడా కోట్లు కుమ్మరించాల్సిన పరిస్థితి. ఇక ఈ సమయంలో మల్టీస్టారర్ చిత్రాలు నిర్మించడం అంటే మరింత కత్తిమీద సాము. అసలు మల్టీస్టారర్ చిత్రాలకు హీరోలు ముందుకు రావడమే కష్టంగా ఉంది. ఒక వేళ ఇద్దరు హీరోలు ఒప్పుకుని సినిమా చేసేందుకు ముందుకు వస్తే వారి పాత్రలు మరియు బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుకే మల్టీస్టారర్ చిత్రాలను నిర్మించేందుకు నిర్మాతలు కాస్త వెనుకాడుతారు. కాని దిల్రాజు మాత్రం వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు సిద్దం అవుతున్నాడు.
ఇటీవలే నాగార్జున, నానిల కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ గురించి ప్రకటన వచ్చింది. ఆ సినిమా నిర్మాత అశ్వినీదత్ అయినా కూడా దిల్రాజు కూడా భాగస్వామిగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ఇటీవలే నితిన్ మరియు శర్వానంద్లు ఈ మల్టీస్టారర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాగుడు మూతలు అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే సెట్స్పైకి వెళ్లబోతుంది. ఇక అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్రాజు మరో మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.
అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ చిత్రానికి ‘ఎఫ్ 2’ అనే టైటిల్ను ఖరారు చేశారు. మెగా హీరోలు ఈ మల్టీస్టారర్లో నటిస్తారు అనే ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఎఫ్ 2 చిత్రంలో నటించే ఇద్దరు హీరోలు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా మూడు మల్టీస్టారర్ చిత్రాలను ఒకే సంవత్సరంలో విడుదల చేయబోతున్నాడు దిల్రాజు. ఒక్క మల్టీస్టారర్ చిత్రం చేయడమే గగనం అనుకుంటున్న సమయంలో ఒకేసారి మూడు మల్టీస్టారర్ చిత్రాలు అంటే మామూలు విషయం కాదు. ఇది దిల్రాజు నమోదు చేయబోతున్న అరుదైన రికార్డు. ఈ రికార్డును ఇప్పట్లో ఎవరు కూడా బీట్ చేయలేరు.