పార్టీ మారిన నేతకు జగన్ బంపర్ ఆఫర్

jagan bumper offer to the party changed leader

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జూన్ 8న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి తనదైన మార్క్ వేస్కోవాలని చూస్తున్న జగన్ అటు వివిధ శాఖల పై అధ్యయనం తో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పోస్టుల పైన కూడా దృష్టి సారించారు. ఏపీలో ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా ఎవరిని నియమించాలనే దానిపై దృష్టిసారించిన జగన్ త్వరలో ఆ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే టీటీడీ ఛైర్మన్ రేసులో మోహన్ బాబు, కోన రఘుపతి తదితరులు ఉండగా జగన్ తన మాత్రం బాబాయి వై వి సుబ్బారెడ్డి పేరును ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే మామూలుగా చుట్టుపక్క రాష్ట్రాలలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో బోర్డు మెంబర్ పదవి ఇవ్వడం ఆనవాయితీ, తెలంగాణా విషయంలో ఖమ్మం జిల్లా నుండి ఒకరికి టిటిడి సభ్యుడిగా అవకాశమిచ్చిన నేపథ్యం ఉంది. ఈ నేపధ్యంలో 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా విజయం సాధించి, ఆపై టీఆర్ఎస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టీటీడీ బోర్డ్ సభ్యుడి పదవిని ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేయలేదు. ఖమ్మం నుండి ఎంపీగా నామా నాగేశ్వరరావు పోటీచేసి రేణుకా చౌదరిపై విజయం సాధించారు. కానీ పొంగులేటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన బాధ్యతలు పోషించారు. ఇక ఈ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు టిటిడి బోర్డు మెంబర్ గా అవకాశం ఇస్తారని అంటున్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రాంతం నుండి టిటిడి బోర్డు సభ్యుడిగా సండ్ర వెంకటవీరయ్య ను నియమించింది అయితే 2018 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సండ్ర వెంకటవీరయ్య టిటిడి బోర్డు మెంబర్ గా ప్రమాణస్వీకారం చెయ్యలేదు. ఆ తర్వాత ఖమ్మం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరావు లేదా జిల్లా టీడీపీ అధ్యక్ష్యుడు కోనేరు చిన్నికి టిటిడి బోర్డు మెంబర్ గా అవకాశం ఇవ్వాలని భావించారు. కానీ అనూహ్యంగా టిడిపి ఓటమిపాలైంది.