వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కూతురి హత్య

killed daughter for obstructing extramarital affairs

తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కుమార్తెను హతమార్చిన తల్లిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం నెడుమంగాడు సమీపంలోగల తేక్కుంకరై ప్రాంతానికి చెందిన మంజూషా (34)భర్త మృతిచెందాడు. కుమార్తె మీరా (16) అదే ప్రాంతంలో ఇంటర్ చదువుతోంది. మీరా అమ్మమ్మ ఇంట్లోనే ఉంటూ చదువుతోంది. ఇలావుండగా మంజూషాకు అదే ప్రాంతానికి చెందిన అనీష్‌ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. మీరా అమ్మమ్మ ఇంట్లో ఉండడంతో వీరి సంబంధానికి ఎటువంటి అడ్డంకి లేకపోయింది. కానీ రెండు వారాల క్రితం హఠాత్తుగా మీరా ఇంటికి వచ్చింది. ఆ సమయంలో తల్లి, యువకుడు అభ్యంతరకరమైన స్థితిలో ఉండడం చూసి తల్లిని నిలదీసింది. దీన్తి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న మీరాను తొలగించుకునేందుకు అనీష్ , మంజూషాలు నిర్ణయించి, మయం కోసం వేచి చూశారు. నిద్రపోతున్న మీరాను గొంతు నులిమి హత్య చేశారు. తర్వాత ఆమె మృతదేహాన్ని అక్కడున్న ఒక పాడుబడిన బావిలో పారేశారు. తర్వాత కుమార్తె మీరా ప్రేమికుడితో పరారైనట్లు, వారిని కనుగొనేందుకు వెళుతున్నట్లు మంజూష తన తల్లికి తెలిపింది. దీంతో ఆమె కూడా దీన్ని నమ్మింది. అయితే మంజూషా వెళ్లి పది రోజులైనా తిరిగి రాలేదు. దీంతో దిగ్భ్రాంతి చెందిన అమ్మమ నెడుమాంగాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అనీష్‌ కూడా అదృశ్యమైనట్లు తెలిసింది. పోలీసుల దర్యాప్తులో ఈ ఇరువురు ప్రేమికులు నాగర్‌కోయిల్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అందులో ఉంటున్నారని, పోలీసులు గుర్తించకుండా తమ సెల్‌ఫోన్‌ నంబర్లను మార్చివేశారు. అయినా సెల్‌ఫోన్‌ ఐఎంఈఐ నంబరు ఆధారంగా ఇరువురు ఉన్న స్థలాన్ని పోలీసులు కనుగొన్నారు. పోలీసుల విచారణలో మీరా ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు, తాము భయపడి మృతదేహాన్ని బావిలో పడేసినట్లు తెలిపారు. కానీ ఇద్దరూ ఒకరికొకరు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు వీరిని అనుమానించి, మీరా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. ఆ నివేదికలో మీరాను గొంతు నులిమి హత్య చేసినట్లు తెలిసింది. దీంతో వీరిని పోలీసులు అరెస్టు చేసి జైలులో నిర్బంధించారు.