సూపర్స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’పై పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు మూడేళ్లుగా మరో సినిమాకు కమిట్ కాకుండా కేవలం ఈ చిత్రానికే తన సమయాన్ని కేటాయిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ను ఈ ఏడాది అక్టోబర్ నాటికి మహేష్ బాబు పూర్తి చేసే అవకాశం ఉందని టాక్.
ఆ తర్వాత 2027 మార్చిలో ‘వారణాసి’ ప్రమోషన్స్ ప్రారంభమయ్యే వరకు మహేష్కు కొంత గ్యాప్ లభించనుంది. దీంతో ఈ ఖాళీ సమయంలోనే తన తదుపరి రెండు ప్రాజెక్ట్లను వరుసగా పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. మహేష్ తన నెక్స్ట్ సినిమాగా ఎవరితో పనిచేయబోతున్నారనే విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు.
మహేష్తో సినిమా చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్, ఏషియన్ సునీల్, దిల్ రాజు, కేవీఎన్ ప్రొడక్షన్స్, హోంబలే ఫిలింస్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. పలువురు దర్శకులు కూడా మహేష్కు కథలు వినిపించినట్లు ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్ కూడా అధికారికంగా ఫైనల్ కాలేదని తెలుస్తోంది.
ముఖ్యంగా మహేష్ తన తదుపరి సినిమాను తెలుగు దర్శకుడితో చేయాలా? లేక ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడితో ముందుకు వెళ్లాలా? అనే విషయంలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పలువురు స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, వారు ఇప్పటికే ఇతర ప్రాజెక్ట్లతో బిజీగా ఉండటం కూడా మరో కారణంగా మారింది.
అయితే ‘వారణాసి’ షూటింగ్ పూర్తయ్యే సమయానికి మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, తన తదుపరి రెండు సినిమాలను కూడా వీలైనంత త్వరగా లైన్లో పెట్టాలని మహేష్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ‘వారణాసి’పైనే ఫోకస్ పెట్టిన మహేష్.. ఆ తర్వాత ఎవరితో జతకట్టబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో రోజురోజుకూ పెరుగుతోంది. మరి ఈ సస్పెన్స్కు సూపర్స్టార్ ఎప్పుడు తెరదించుతారో చూడాలి.





