లాక్‌డౌన్ పొడిగింపు పై స్పష్టత ఇవ్వనున్న మోడీ

లాక్‌డౌన్ పొడిగింపు పై స్పష్టత ఇవ్వనున్న మోడీ

కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్ రేపటితో ముగియనుంది. ఈ లాక్‌డౌన్‌ కొనసాగింపుపై సోమవారం స్పష్టత రానుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడిగించాలంటూ ప్రధానితో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని.. దీనిపై ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ, పంజాబ్‌, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ్‌బెంగాల్‌, కర్ణాటక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం కరోనా ప్రభావిత ప్రాంతాలను జోన్‌లు‌గా విభజించి, వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకే ఆంక్షలు పరిమితం చేయాలని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్‌ 15 నుంచి దేశాన్ని మూడు జోన్లుగా విభజించే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు భోగట్టా. నమోదైన కేసుల ఆధారంగా రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా గుర్తించాలని కేంద్రం భావిస్తోంది. ఏప్రిల్‌ 15 తర్వాత మరో రెండు వారాల పాటు కొవిడ్‌-19ను సమర్ధంగా ఎదుర్కోవడానికి ఇది ఉపకరిస్తుందని ప్రభుత్వం యోచిస్తోంది.

కాగా, లాక్‌డౌన్‌ కొనసాగితే ఆంక్షల నుంచి ఏయే రంగాలను మినహాయించాలన్నదానిపై కేంద్ర హోంశాఖ ఒక జాబితా రూపొందిస్తోంది. వ్యక్తిగత దూరాన్ని కచ్చితంగా పాటించే నిబంధనతో వ్యవసాయ, చిన్న-మధ్య తరహా, మౌలిక వసతుల రంగాలకు సంబంధించి కొన్ని ఆంక్షలను మినహాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో విమానయాన రంగానికి కూడా మినహాయింపు లభించవచ్చని సమాచారం.