బాబు నివాసానికి నోటీసులు…కూల్చివేత ?

Notices for babu house

ప్రజావేదికతో మొదలైన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. తాజాగా విశాఖలోనూ పని మొదలు పెట్టింది. టీడీపీకి చెందిన మాజీ ఎంపీ మురళీ మోహన్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ భవనాలను కూల్చి వేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక రాజధాని విషయానికొస్తే.. ప్రజావేదికతో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించిన ఏపీ ప్రభుత్వం.. కృష్ణా కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. శుక్రవారం కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న అక్రమ నిర్మాణాలపై సీఆర్డీఏ కొరడా ఝుళిపించింది. చంద్రబాబు నివాసం సహా 28 భవనాల యజమానులకు సీఆర్డీఏ నోటీసులు పంపించింది. చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్‌కు సీఆర్డీఏ అధికారులు నోటీసులు అంటించారు. నోటీసులకు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని వివరణ ఇవ్వకపోతే భవనాలు తొలగిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో అక్రమ కట్టడాలకు అధికారులు ఈ నోటీసులు ఇస్తున్నారు. కరకట్ట వెంట ఉన్న అక్రమ నిర్మాణాల యజమానులకు నోటీసులు ఇస్తున్నారు అధికారులు.. మరో 20 అక్రమ నిర్మాణాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. అలాగే కరకట్ట వెంబడి 100 మీటర్లలోపు 50 అక్రమ కట్టడాలు గుర్తించారు. వారికి త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నారు. చంద్రబాబు నివాసానికి అంటించిన నోటీసుల్లో అనుమతి లేకుండా పది తాత్కాలిక షెడ్లు నిర్మించారని చట్టపరమైన అనుమతి లేకుండా మొదటి అంతస్తు, గదుల నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. అలాగే భవనం, స్విమ్మింగ్ పూల్, హెలీప్యాడ్ నిర్మాణంపైనా అభ్యంతరాలు తెలిపారు. నదికి 100 మీటర్లలోపు ఈ నిర్మాణం ఉందని సీఆర్డీఏ సెక్షన్ 115 (3) ప్రకారం నోటీసులు పంపారు. భవనాల నిర్మాణానికి సంబంధించి సంజాయిషీ సంతృప్తికరంగా లేకపోతే కఠినచర్యలు తప్పవని నోటీసుల్లో పేర్కోన్నారు.