లైవ్ లో పోట్లాడుకున్న యాంక‌ర్లు …వీడియో వైరల్

Pakistan News Readers Funny Fight On TV News Channel Live

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

లైవ్ లో న్యూస్ చ‌దివేట‌ప్పుడు న్యూస్ రీడ‌ర్లు చాలా అప్ర‌మ‌త్తంగా ఉంటారు. కోపం, న‌వ్వు, ఆనందంలాంటి ఎలాంటి ఫీలింగ్స్ నైనా కంట్రోల్ చేసుకుని ముఖంలో ఎలాంటి భావాలూ ప‌లికించ‌కుండా న్యూస్ చ‌దువుతారు. వ్య‌క్తిగ‌త విష‌యాలను ఆ స‌మ‌యంలో ప‌క్క‌న‌పెట్టి ప్రొఫెష‌న‌లిజం చూపిస్తారు. న్యూస్ రీడ‌ర్లు వార్త‌లు చ‌దివే స‌మ‌యంలో ఎంత నిబ‌ద్ధ‌తో ఉంటార‌నేదానికి కొన్ని నెల‌ల క్రితం భార‌త్ లో జ‌రిగిన ఓ ఘ‌ట‌న ఉదాహ‌ర‌ణ‌. ఓ న్యూస్ రీడ‌ర్ బులెటిన్ ను ముగించ‌బోయే స‌మ‌యంలో బ్రేకింగ్ న్యూస్ ఒక‌టి వ‌చ్చింది. రిపోర్ట‌ర్ ఆ న్యూస్ కు సంబంధించిన ఫోన్ ఇన్ కూడా ఇచ్చారు.

ఆ బ్రేకింగ్ న్యూస్ చ‌దివిన న్యూస్ రీడ‌ర్ ఫోన్ ఇన్ కూడా మామూలుగానే తీసుకుంది. అది ఓ యాక్సిడెంట్ కు సంబంధించిన న్యూస్. ఫోన్ ఇన్ లో రిపోర్ట‌ర్ యాక్సిడెంట్ అయిన కారు నెంబ‌ర్, యాక్సిడెంట్ అయిన ప్ర‌దేశం, మృతుల వివ‌రాలు చెప్పాడు. ఫోన్ ఇన్ లో మామూలుగానే ప్ర‌శ్న‌లు అడిగిన న్యూస్ రీడ‌ర్ త‌రువాత వార్త‌ను  ముగించి ఒక్క‌సారి పెద్ద‌పెట్టున ఏడ్చింది. దానికి కార‌ణం యాక్సిడెంట్ అయిన కారు ఆమె భ‌ర్త‌దే. మృతుల్లో ఆమె భ‌ర్త కూడా ఉన్నారు. అయినా స‌రే పంటిబిగువున బాధ‌ను అదిమిపెట్టి…వార్త‌ను చ‌దివిన ఆమె బులెటిన్ ను ముగుస్తూనే కుప్ప‌కూలిపోయింది. వృత్తి ప‌ట్ల ఆ న్యూస్ రీడ‌ర్ చూపిన అంకిత భావంపై అప్ప‌ట్లో ఎంత‌గానో ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.

ఇలా కొంద‌రు వ్య‌క్తిగ‌త బాధ‌ల‌ను సైతం ప‌క్క‌న‌పెట్టి న్యూస్ చ‌దివేట‌ప్పుడు నిబద్ధ‌తతో ఉంటే మ‌రికొంద‌రు మాత్రం చిన్న చిన్న గొడ‌వ‌ల‌ను కూడా లైవ్ లో కొన‌సాగించి..త‌మ వార్తా సంస్థ‌ల‌ను అభాసుపాలు చేస్తున్నారు. డైలీ పాకిస్థాన్ న్యూస్ చాన‌ల్ లో జరిగిన ఇలాంటి ఘ‌ట‌న ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ చాన‌ల్ కు చెందిన ఇద్ద‌రు న్యూస్ రీడ‌ర్లు బ్రేక్ స‌మ‌యంలో గొడ‌వ‌ప‌డ్డారు. మేల్ న్యూస్ రీడ‌ర్, ఫిమేల్ న్యూస్ రీడ‌ర్ పై   ఆగ్ర‌హం వ్య‌క్తంచేశాడు.

సాధార‌ణంగా ఇలాంటి ప‌రిస్థితి ఎద‌రైతే లైవ్ వ‌చ్చేముందే న్యూస్ రీడ‌ర్లు, యాంక‌ర్లు జాగ్ర‌త్త‌ప‌డ‌తారు. కానీ వీరు మాత్రం బ్రేక్ అయిపోయి లైవ్ లోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా గొడ‌వ‌ను కంటిన్యూచేశారు. ఇటువంటి యాంక‌ర్ తో నేను  ఎలా బులెటిన్ కొన‌సాగించాలి అని మేల్ యాంక‌ర్ అన‌గా…మాట‌లు స‌రిగ్గా రానీయ్ అని ఫిమేల్ యాంక‌ర్ క‌స్సుమంది. 30 సెక‌న్ల పాటు సాగిన ఈ సంభాష‌ణ‌ను ప్రేక్ష‌కులు లైవ్ లో చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. న్యూస్ చాన‌ల్ కు చెందిన ఒక ఉద్యోగి ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో ఉంచ‌డంతో అది వైర‌ల్ గా మారింది. క్యూట్ పాకిస్థాన్ యాంక‌ర్స్ అంటూ నెటిజ‌న్లు వారిని కామెంట్లుచేస్తున్నారు.