Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన కూడా వైసీపీ బాటలోనే నడుస్తూ తమ పార్టీ కి కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ నియమించుకుంది. స్ట్రాటజిస్ట్ గా పదేళ్ల అనుభవం ఉన్న దేవ్ ను రిక్రూట్ చేసుకుంది. దేవ్ రాకతో… తమ పార్టీ అద్భుతాలు చేయడం ఖాయమని జనసేన వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే చిన్నాచితకా పార్టీలతో పాటూ మేజర్ పార్టీలూ పొలిటికల్ స్ట్రాటజిస్టులను ఏర్పాటుచేసుకున్నాయి. తాము ఒప్పుకున్నా పార్టీకి ఎన్నికల్లో విజయం కట్టబెట్టే ఫార్ములాలు, ప్లాన్ల రూపకల్పనలో వీరు తలమునకలై ఉన్నారు. స్ట్రాటజిస్ట్ గా దేశీయంగానే కాక విదేశాల్లోనూ ఆయన స్ట్రాటజిస్ట్ గా పనిచేశారు. ఈ అనుభవం తమ పార్టీకి కలిసివస్తుందని జనసేన విశ్వసిస్తోంది. ఇటు దేవ్ సైతం అదే జోష్ తో ఉన్నారు. పవన్ కు ప్రజాసమస్యలపై స్పష్టత ఉందన్న ఆయన… పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని క్షేత్రస్థాయి నుంచే జనసేనను బలోపేతం చేసేందుకు ప్రాధాన్యతనిస్తున్నట్లు వివరించారు.
ప్లీనరీలో తనను పీకేనే సీఎంను చేస్తాడని చెప్పుకుని, తనకు రాజకీయం చేతకాదని నేరుగానే చెప్పేశారు జగన్. ఇప్పుడు పవన్ కూడా తమ పార్టీని గెలిపించేది దేవ్ అని చెప్పి తనకి రాజకీయం చేతకాక మరో వ్యక్తికి భాధ్యతలు ఇచ్చినట్టు అయ్యింది. అంటే ఇప్పుడు జగన్ – పవన్ ల రాజకీయానికి కర్త, కర్మ, క్రియ పీకే -దేవ్ లన్న మాట . జనసేన అధినేత పవన్ కూడా జగన్ తరహాలోనే పార్టీ మీటింగ్ ఒకటి పెట్టి అందులో దేవ్ ని పరిచయం చేసాడు. ఆయన కూడా పీకే లానే ఇంగ్లిష్లో కాస్త మాట్లాడి పవన్ ను ముఖ్యమంత్రిని చేసేస్తానని అన్నారు. అసలు తెలుగు రాజకీయాల్లో ఈ తెలుగు రాని స్ట్రాటజిస్టుల స్ట్రాటజీ ఏంటో ఓక పట్టాన అర్ధమయ్యి చావదు.
విదేశాల్లో రాజకీయాలకు సంబంధం లేని వేరే చదువు చదివి… ఆఫ్రికా దేశాల్లో ఆరోగ్య రంగంలో… ఐక్యరాజ్యసమితి తరపున పని చేసి… బిహార్ ఎన్నికలకి, భారత దేశ ఎన్నికలకి పనిచేసి ఇప్పుడు వచ్చి ఏపీ నుండి వచ్చిన రాజకీయ నేతలకు వ్యూహాలు నేర్పడమంటే మన బుర్రకి ఓక పట్టాన పట్టే విషయం కాదు. కాలేజీల్లో, యూనివర్శిటీల్లో చెప్పే పొలిటికల్ సైన్స్ కి పుస్తకాల్లో ఉండే రాజకీయాలకు వాస్తవంగా ఉండే రాజకీయాలకు అసలేమాత్రం పొంతన ఉండదు. ఎలా అంటే ఏదయినా ఒక వంటకాన్ని వంటల పుస్తకంలో చదవడం ఈజీనే కానీ అది వండేతప్పుదే తెలుస్తుంది అసలు కష్టం. గతంలో ఒక జోక్ ఉండేది ఒక వంట రాని మనిషి వంటల పుస్తకం చూసి ఒక వంటకం మొదలుపెడితే అది మూడు గంటల తర్వాత కూడా పూర్తవ్వలేదట, ఏమిటా అని చూస్తే ఆమె పొయ్యి వెలిగించలేదు, అదేమిటీ అనడగితే పుస్తకంలో పొయ్యి వెలిగించమని లేదుగా అని ఎదురు ప్రశ్నించిందట, ఈ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ లని నమ్ముకుంటే మన నాయకుల పరిస్థితీ అదే అవుతుంది.
ఒకరకంగా చూస్తే వీరు చేసే పనేంటంటే కొన్ని యూనివర్సిటీలలో పొలిటికల్ సైన్సు చదువుతున్న కొంతమందిని కలిపి ఒక టీం ఫాం చేసి అన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని ఓ నివేదిక తయారు చేస్తారు. పుస్తకాల్లో చదివిన దానిని లీడర్ల మీద రుద్దుతారు. కొట్లలో ఫీజులు వసూలు చేసుకుని రకరకాల నివేదికలు తయారు చేస్తారు అవన్నీ తమకి పనిచ్చిన రాజకీయనాయకుడికి అనుకూలంగానే ఉంటాయి కాని వాస్తవికతకి మాత్రం చాలా దూరంగా ఉంటాయి. దానికి పీకే నంద్యాల ఉప ఎన్నికకి ఇచ్చిన సర్వే రిపోర్ట్ సాక్ష్యం. ఇప్పటికయినా మన నాయకులు ఎక్కడినుండో ఎవరినో తెచ్చుకుని గెలిచేస్తాం అని ధీమాగా ఉండకుండా ప్రజలలోకి వెళ్లి వారి సమస్యలు తీరిస్తే గెలిచే అవకాశం ఉంటుంది.