ఆ ఇద్దరిలో ప్రభాస్‌ కోసం ఒకరు

Pooja Hegde to pair Up with Prabhas in Radha Krishna Direction

‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్‌ చేస్తోన్న చిత్రం ‘సాహో’. బాలీవుడ్‌ రేంజ్‌లో దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ ఎత్తున రూపొందుతున్న సాహో చిత్రంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్దా కపూర్‌తో పాటు ఇంకా పలువురు బాలీవుడ్‌ నటీనటులు కనిపించబోతున్నారు. సాహో చిత్రం తర్వాత ఒక రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాన్ని ప్రభాస్‌ చేయబోతున్నాడు. జిల్‌ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా రూపొందబోతున్న ఆ చిత్రాన్ని కూడా యూవీ క్రియేషన్స్‌ వారే నిర్మించబోతున్నారు. 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. ఆ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్న విషయం తెల్సిందే.

‘సాహో’ చిత్రంను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు రాధాకృష్ణ దర్శకత్వంలో చిత్రాన్ని నవంబర్‌లో మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను మొదట అనుకున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్‌ వారు ఇప్పటికే పూజా హెగ్డేతో ఫొటో షూట్‌ను కూడా నిర్వహించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక క్యూట్‌ లవ్‌ స్టోరీని ప్రభాస్‌ చేయబోతున్నాడు. ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే అయితే బాగుంటుందని అంతా భావిస్తున్నారు.