తేజూ ఇంకా జాగ్రత్త పడటం లేదు!

Sai Dharam Tej Next Movie Bhagavath Geetha Sakshiga

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న చిత్రాలు వరుసగా బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడుతూ వస్తున్నాయి. వరుసగా ఈయన చేసిన సినిమాలు ఫ్లాప్‌ అవుతున్నా కూడా కథల ఎంపిక విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ముందు కమిట్‌ అయ్యి ఉండటం వల్ల సినిమా ఫ్లాప్‌ అవుతుందని తెలిసినా కూడా తప్పని పరిస్థితుల్లో చేస్తున్నాను అంటూ చెబుతున్న సాయి ధరమ్‌ తేజ్‌ ఇటీవలే ‘తేజ్‌ ఐలవ్‌ యు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కిన ‘తేజ్‌ ఐలవ్‌ యూ’ చిత్రం కూడా ఫ్లాప్‌ అయ్యింది. ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజ్‌ తాజాగా మరో ఫ్లాప్‌ను మూటకట్టుకున్నాడు.

సాయి ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం ‘నేను శైలజ’ ఫేం కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ చిత్రాన్ని మైత్రి మూవీస్‌ వారు నిర్మిస్తున్నారు. తేజూ ప్రస్తుతం ఆశలు అన్ని కూడా ఈ చిత్రంపైనే పెట్టుకున్నాడు. సహజంగా అయితే ఈ చిత్రం విడుదలైన తర్వాత మరో సినిమాకు కమిట్‌ అవ్వాలి. కాని తేజూ మాత్రం ఒక వైపు కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో చిత్రాన్ని చేస్తూనే మరో సినిమాకు కమిట్‌ అయ్యాడు. ఆ సినిమాను కూడా కొత్త దర్శకుడితో చేయబోతున్నాడు. వరుసగా ఫ్లాప్‌లు ఎదుర్కొంటున్న హీరో కొత్త దర్శకుడితో సినిమా చేయడం అంటే కత్తిమీద సాము వంటిది. కాని తేజూ మాత్రం ఏమాత్రం ఆలోచన లేకుండా, జాగ్రత్త లేకుండా తన తదుపరి చిత్రాన్ని కొత్త దర్శకుడి దర్శకత్వంలో చేస్తున్నాడు. గోపాల్‌ అనే దర్శకుడి దర్శకత్వంలో తేజూ చేయబోతున్న సినిమాకు అప్పుడే ‘భగవద్గీత సాక్షిగా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని ఠాగూర్‌ మధు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సంవత్సరంలోనే తేజూ మరో రెండు చిత్రాలను తీసుకు రాబోతున్నాడు. సినిమాల సంఖ్య పెంచుకుంటున్న తేజూ సక్సెస్‌ రేట్‌ తగ్గించుకుంటూ వస్తున్నాడు.