Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఐదేళ్ల శిక్షకు గురయిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జైలు జీవితం మొదటిరోజు సాధారణఖైదీలాగే ముగిసింది. తనకు బెయిల్ వస్తుందన్న ఆశతో సల్మాన్ తొలిరోజు గడిపాడు. జోధ్ పూర్ కేంద్రకారాగారంలో అత్యంత భద్రమైన బ్యారక్ నంబర్ 2ను సల్మాన్ కు కేటాయించారు.
జైలులో సల్మాన్ కు ప్రత్యేక సౌకర్యాలేమీ కల్పించలేదు. జైలు అధికారులు ఆహారంగా ఇచ్చిన రోటీ, పప్పును సల్మాన్ తినలేదు. రాత్రి నిద్రపోవడానికి ఓ చెక్కమంచం, నాలుగు దుప్పట్లు సల్మాన్ కు ఇచ్చారు. సల్మాన్ రాత్రి అక్కడే నిద్రపోయాడు. సల్మాన్ కు ఆయన మేనేజర్ హోటల్ తాజ్ నుంచి ఆహారం, దుస్తులు తెచ్చి ఇచ్చినట్టు వచ్చిన వార్తలను జైలు సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ తోసిపుచ్చారు. మేనేజర్ వాటిని తెచ్చిన మాట వాస్తవమే అయినా… దుస్తులు మాత్రమే తీసుకుని ఆహారం వెనక్కి పంపామని చెప్పారు. జైలులో సల్మాన్ కు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదని స్పష్టంచేశారు.
జైలుకు వచ్చినప్పుడు ఆయనకు రక్తపోటు ఉందని, జైలు వైద్యుల పరీక్షల అనంతరం ప్రస్తుతం సాధారణ స్థితికి చేరిందని తెలిపారు. ప్రస్తుతానికి సల్మాన్ నీళ్లు తప్ప ఏమీతీసుకోవడం లేదన్నారు. ఈ ఉదయం అందరితో పాటు బ్రేక్ ఫాస్ట్, టీ ఇచ్చామని చెప్పారు. శిక్షాకాలం మూడేళ్ల కన్నా ఎక్కువ ఉండడంతో బెయిల్ కోసం సల్మాన్ ఉన్నతన్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సల్మాన్ జోధ్ పూర్ జైలుకు రావడం ఇది నాలుగోసారి. కృష్ణ జింకలను వేటాడిన కేసులోనే ఆయన 1998, 2006, 2007 సంవత్సరాల్లో మొత్తం 18 రోజులు జైలు జీవితం గడిపారు.