సంజ‌య్ – మాధురీ… 1993 ప్రేమ‌క‌థ‌

Sanjay Dutt and Madhuri Dixit Love Story and Break up

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బాలీవుడ్ హిట్ పెయిర్ లో సంజ‌య్ ద‌త్-మాధురీ దీక్షిత్ జంట ఒక‌టి. 1990ల్లో వారికి చాలా క్రేజ్ ఉండేది. ఇద్ద‌రూ క‌లిసి సాజ‌న్, ఖ‌ల్ నాయిక్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల్లో న‌టించారు. ఆ సినిమాల స‌మయంలోనే వారి మ‌ధ్య ప్రేమ చిగురించింది. అప్ప‌టికే పెళ్ల‌యిఉన్న‌ప్ప‌టికీ సంజ‌య్ మాధురితో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయారు. వారి ప్రేమ గురించి ప‌త్రిక‌ల్లో అనేక క‌థ‌నాలు వ‌చ్చాయి. పెళ్లిచేసుకోబోతున్నార‌ని కూడా వార్త‌లొచ్చాయి. 1993లో సాహిబ‌న్ సినిమా స‌మ‌యానికి వారి ప్రేమ పీక్ స్టేజ్ కి వెళ్లిపోయింది. సాహిబ‌న్ ద‌ర్శ‌కుడు ర‌మేశ్ త‌ల్వార్ స్వ‌యంగా ఈ విష‌యం వెల్ల‌డించాడు. సెట్ లో అంద‌రూ ఉన్నార‌ని కూడా చూడ‌కుండా సంజయ్ ఐ ల‌వ్ యూ అంటూ మాధురి వెంట‌ప‌డేవాడ‌ని ర‌మేశ్ త‌ల్వార్ చెప్పాడు. మాధురీ కూడా ప‌లు ఇంట‌ర్వ్యూల్లో సంజ‌య్ పై త‌న‌కున్న ప్రేమ‌ను తెలియ‌జేసింది. సంజ‌య్ అంటే త‌న‌కు కూడా ఇష్ట‌మేన‌ని, ఆయ‌న ఎప్పుడూ స‌ర‌దాగా ఉంటార‌ని, ఆయ‌న‌తో క‌లిసి ఉండ‌డం ఇష్ట‌మ‌ని చెబుతుండేది.

సాహిబ‌న్ సినిమా సమ‌యంలోనే సంజ‌య్ భార్య రిచా శ‌ర్మ క్యాన్స‌ర్ ట్రీట్ మెంట్ కోసం కూతురు త్రిషాలాను తీసుకుని న్యూయార్క్ వెళ్లింది. ఆమె క్యాన్స‌ర్ నుంచి కోలుకుంటున్న స‌మ‌యంలో సంజ‌య్-మాధురీల ప్రేమ వ్య‌వ‌హారం తెలిసింది. దీంతో త‌న వైవాహిక జీవితాన్ని కాపాడుకునేందుకు ఆమె హుటాహుటిన కూతురితో క‌లిసి ముంబై వ‌చ్చేసింది. వాళ్లు వ‌స్తున్నార‌ని తెలిసిన‌ప్ప‌టికీ… భార్య, కూతురుని రిసీవ్ చేసుకోడానికి సంజ‌య్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లలేదు. ఇంత జ‌రిగిన‌ప్ప‌టికీ రిచా సంజ‌య్ ను ఒక్క‌మాట కూడా అన‌లేదు. ఎంత‌యినా సంజ‌య్ త‌న భ‌ర్త‌ని, అత‌నంటే త‌న‌కు ప్రాణ‌మ‌ని ఆమె అంటుండేది. సంజ‌య్ కూడా భార్య‌కు విడాకులు ఇవ్వ‌ను అంటూనే, మాధురి ఒత్తిడి మేర‌కే, మ‌రే కార‌ణ‌మోగానీ 1993లో రిచా నుంచి చ‌ట్ట‌బ‌ద్ధంగా విడిపోయాడు. భ‌ర్త దూర‌మైన బాధ‌లో రిచాకు మ‌ళ్లీ క్యాన్స‌ర్ సోకింది. ఆ బాధ‌లోనే ఆమె క‌న్నుమూసింది.

సంజ‌య్ ద‌త్ జీవితం ఆధారంగా ప్ర‌ముఖ ర‌చ‌యిత యాస్సేర్ ఉస్మాన్ రాసిన బాలీవుడ్ బ్యాడ్ బాయ్ సంజ‌య్ ద‌త్ పుస్త‌కంలో ఈ విష‌యాలన్నీ వెల్ల‌డించారు. పుస్త‌కంలో మాధురి వెర్ష‌న్ ను చెప్ప‌క‌పోయిన‌ప్ప‌టికీ నిజానికి మాధురీ కూడా సంజ‌య్ ను గాఢంగా ప్రేమించింది. పెళ్లికూడా చేసుకోవాల‌నుకుంది. అన్నీ స‌జావుగా జ‌రిగిఉంటే రిచాతో విడిపోయిన త‌ర్వాత సంజ‌య్, మాధురి పెళ్లిపీట‌లెక్కేవారే. కానీ ముంబై పేలుళ్ల కేసులో సంజ‌య్ ద‌త్ పేరు బ‌య‌టికి రావ‌డంతో వీరి ప్రేమ వ్య‌వ‌హారం మ‌లుపు తిరిగింది. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ముంబై పేలుళ్ల కేసులో సంజ‌య్ ద‌త్ కు సంబంధం ఉందంటూ… ఆయ‌న్ను పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో మాధురి షాక్ కు గుర‌యింది. సంజ‌య్ ను కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేయ‌డానికి కూడా ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ అది సాధ్యం కాక‌పోవ‌డంతో నెమ్మ‌దిగా దూరం జ‌రిగింది. అలా ముంబై పేలుళ్లు ఈ జంట‌ను విడ‌దీశాయి. 1999లో మాధురీ శ్రీరామ్ నెనే అనే ఎన్ ఆర్ ఐను పెళ్లిచేసుకుంది. అటు సంజ‌య్ ద‌త్ 2008లో మాన్య‌త‌ను వివాహ‌మాడారు.