సిద్దు దెబ్బకి వెనక్కి తగ్గిన మోడీ

Siddha Ramayya Counters On Modi
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పదిరోజుల్లోకి వచ్చేసాయి. దక్షిణాదిన ఉన్న ఏకైక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాన్ని ఎలా అయినా కాపాడుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా ఎలా అయినా కర్నాటకలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. అయితే ఎలా అయినా గెలవాలని మొదటి నుండి బీజేపే నుండి అమిత్ షా, కాంగ్రెస్ నుండి రాహుల్ లు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే బీజేపీ విజయమే లక్ష్యంగా ఐదు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య, తన ట్విట్టర్ ఖాతా ద్వారా కొన్ని ప్రశ్నలు సంధించారు. ’గాలి కుటుంబం సభ్యులకు, మిత్రులకు 8 సీట్లు ఇచ్చారు. దీంతో కనీసం బీజేపీ పది లేదా పదిహేను సీట్లు రావొచ్చని మీరు ఇచ్చారేమో. కాని అవినీతిపై మాకు మీరు ఉపన్యాసం ఇవ్వడం ఏమిటి..? మీ హిపోక్రసీ ఆపండంటూ.. మీ మాటలు నమ్మడానికి కన్నడిగుల చేవిలో కమలం లేవ’ని ఆయన వ్యంగ్యంగా విమర్శించారు. 
కుంభకోణాల్లో ఇరుక్కున్న యడ్యూరప్పను మీరు సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. కాని మీడియాలో వార్తలను చూస్తే మీరు యడ్యూరప్పతో కలిసి వేదిక పంచుకోవడానికి సముఖం లేరని తెలిసిందని సిద్ధరామయ్య ట్వీట్‌ చేశారు. ఇప్పటికీ యడ్యూరప్పనే మీ సీఎం అభ్యర్థా అని ఆయన ప్రశ్నించారు.  బీజేపీ రేపిస్టులకు ఎన్నికల్లో టికెట్లు ఇచ్చిందని ఆరోపిస్తూ, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఉదంతాలను ప్రస్తావించారు. 
అయితే సిద్ద రామయ్య ప్రశ్నించినట్టుగానే కర్ణాటక మైనింగ్ రాజు గాలి జనార్దన్ రెడ్డిని అధికారిక ప్రచార కార్యక్రమానికి రావద్దని, అక్కడ మీడియాకు కూడా కనిపించరాదని బీజేపీ పెద్దలు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదురుకుంటున్న ఆయన ఇటీవల శ్రీరాములు తరఫున ప్రచారం నిర్వహిస్తూ, సిద్ధరామయ్యను రావణుడిగా పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీకి నష్టం కలిగించాయన్న భావనతో ఉన్న ఆ పార్టీ నేతలు, గాలిని ఈ ఎన్నికలకు దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. అదీ కాక ఈరోజు సిద్ద రామయ్య చేసిన ట్వీట్లని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ నెల 3వ తేదీన బళ్లారిలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తుండగా, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాలి జనార్దన్ రెడ్డికి ఆహ్వానం కూడా అందలేదని తెలుస్తోంది. 
రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో నడిచిన ఇనుప గనుల కుంభకోణం, ఆపై గాలిపై వచ్చిన అక్రమాస్తుల కేసు బీజేపీకి ఇబ్బందిగా మారిన సంగతి తెలిసిందే. అందుకే ఆయనకీ టికెట్ ఇవ్వకపోయినా బళ్లారి ప్రాంతంలో ఆయనకు ఉన్న పట్టు, అంగ అర్ధబలాలను వదులుకోవడం ఇష్టంలేని బీజేపీ ఆయన వర్గానికి పెద్దపీట వేస్తూ, దాదాపు 10 నియోజకవర్గాల్లో ఆయన సూచించిన వారికి టికెట్లు ఇచ్చింది. మాట్లాడితే నీతి వాక్యాలు చెప్పే బీజేపీ నేతలు గాలి జనార్ధన్ రెడ్డి ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ ఏమి మెసేజ్ ఇద్దామనో. మొత్తానికి సిద్దు దెబ్బకి మోడీ వెనక్కు తగ్గాడనే చెప్పాలి.