Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఖమ్మం పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఊహించని షాక్ తగిలింది. ఓపెన్ టాప్ వాహనంలో పవన్ అభివాదం చేసుకుంటూ వస్తున్నప్పుడు తల్లాడ సెంటర్ లోకి రాగానే గుర్తు తెలియని వ్యక్తి ఒకరు చెప్పు విసిరారు. అది పవన్ కారు ముందు భాగం మీద పడింది. దీంతో పవన్ అభిమానులు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అనంతరం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ గార్డెన్స్ లో ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రతినిధులతో పవన్ సమావేశం అయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని కామెంట్స్ చేశారు.
“ నాపై దాడులు చేసినా ఎదురు దాడి చేయను. ప్రజల కోసం ఏ కష్టాన్నైనా భరిస్తా. మహనీయుల ఆశయాల కోసం బాధ్యతాయుత రాజకీయాలు చేద్దాం. జనసేన ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు. నాకు కులం, మతం, ప్రాంతం లేవు. మానవత్వం, జాతీయత మాత్రం వుంది. మన సమాజం కులవ్యవస్థతో ముడిపడి వుంది. అందుకే కులాన్ని కాదని రాజకీయాలు చేయలేని పరిస్థితి.” అంటూ పవన్ చేసిన కామెంట్స్ ఆయనలోని ఆదర్శవాదానికి, వాస్తవికతకు మధ్య తేడాని ఎత్తి చూపాయి.
ఇక ఇంతా చేస్తే పవన్ మీదకు చెప్పు విసిరింది ఎవరు అన్నదే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకప్పుడు తెరాస మీద ఘాటు విమర్శలు చేసిన పవన్ కు ఉత్తర తెలంగాణాలో ఎక్కడా వ్యతిరేకత కనిపించలేదు. కానీ అధికార పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఖమ్మంలో చెప్పు విసరడం వెనుక ఎవరు వున్నారు అని జనసేన ఆరా తీసినప్పుడు పవన్ రాకతో ఆంధ్రాలో ఇబ్బందిపడుతున్న పార్టీని అభిమానించే వ్యక్తి ఇందుకు పాల్పడినట్టు తెలిసిందట. అయితే ఈ విషయాన్ని బయటపెట్టడం ఇష్టం లేక జనసేన శ్రేణులు మౌనం దాల్చినట్టు తెలుస్తోంది.