జనసేనలోకి రోజా….క్లారిటీ ఇచ్చేసింది !

YCP Roja clarity about joining Jana Sena party

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ మధ్య మీడియాలో అంతగా కనిపించడంలేదు. కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఆమె ఎందుకు ఉన్నట్లుండి సైలెంట్ అయ్యారు..? వైసీపీ ఫైర్ బ్రాండ్ పార్టీ మారబోతున్నారా..? అనే వార్తలు చాలా పుట్టుకు వచ్చాయి. అయితే దీనిపై ఎవరికీ క్లారిటీ లేదు కానీ, ఎవరికి వారు వాళ్లకు ఇష్టం వచ్చినట్లు ఊహించి వార్తలు వ్రాస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చేసింది. ఈరోజు శ్రీకాళహస్తి దేవస్థానానికి విచ్చేసిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని మోడీని నిలదీస్తానని బీరాలు పలికి ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ఆయనకు వంగి వంగి సలాములు చేశారని ఆయన ఓ అవకాశవాది అని, అందితే జుట్టు, లేకుంటే కాళ్లు పట్టుకునే వ్యక్తిఅని ఢిల్లీలో భూకంపం సృష్టిస్తానన్న చంద్రబాబు అక్కడకు వెళ్లి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మోడీని కలిసిన సమయంలో చంద్రబాబు ముఖంలో ఓ పక్క భయం, మరో పిచ్చినవ్వు కన్పించిందని ఎద్దేవా చేశారు. అవినీతి ముఖ్యమంత్రి నీతి ఆయోగ్‌ సమావేశంలో ఏమి మాట్లాడతారని ప్రశ్నించారు. చంద్రబాబు నాటకాలను ఏపీ ప్రజలంతా చూస్తున్నారని… 2019 ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెబుతారని అన్నారు. ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక, ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న యత్నాల్లో భాగంగానే పనికిరాని సర్వేలతో హడావుడి చేస్తున్నారని విమర్శించారు. తాను జనసేన పార్టీలో చేరబోతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని… చీప్ పబ్లిసిటీ కోసం టీడీపీ నేతలు ఇలాంటి వార్తలను వ్యాపింపజేస్తున్నారని ఈ సందర్భంగా రోజా మండిపడ్డారు. జనసేనలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. పాదయాత్ర సందర్భంగా వైసీపీ అధినేత జగన్ కు రాజమండ్రి ప్రజలు ఘన స్వాగతం పలికారని… జగన్ కోసం ప్రజలు ఎంతగా నిరీక్షిస్తున్నారో ఇది ఒక నిదర్శనమని చెప్పారు. టీడీపీ, బీజేపీలు కుమ్మక్కై రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.